మరో దేశానికి వెళ్లి క్రికెట్‌ ఆడతా అంటున్న శ్రీశాంత్ .!

- October 20, 2017 , by Maagulf
మరో దేశానికి వెళ్లి క్రికెట్‌ ఆడతా అంటున్న శ్రీశాంత్ .!

'నాపై నిషేధం విధించింది బీసీసీఐ మాత్రమే ఐసీసీ కాదు.. కాబట్టి నేను మరో దేశానికి వెళ్లి ఆ దేశం తరఫున క్రికెట్‌ ఆడతా' అని టీమిండియా మాజీ పేసర్‌ శ్రీశాంత్‌ తెలిపాడు. తాజాగా కేరళ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం బీసీసీఐ విధించిన జీవితకాల నిషేధాన్ని పునరుద్ధరించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.

దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీశాంత్‌ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. 'నా పై బీసీసీఐ మాత్రమే నిషేధం విధించింది. ఐసీసీ కాదు కదా. కాబట్టి భారత్‌లో కాకపోతే మరో దేశానికి వెళ్లి ఆ దేశం తరఫున క్రికెట్‌ ఆడతా. నా వయసు 34. మహా అయితే మరో ఆరేళ్లు నేను ఆడగలను. నాకు క్రికెట్‌ అంటే చాలా ఇష్టం. ఎలాగైనా క్రికెట్‌ ఆడాలన్నది నా కోరిక' అని శ్రీశాంత్‌ తెలిపాడు.

2013 ఐపీఎల్‌లో స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడన్న అభియోగాలపై బీసీసీఐ.. శ్రీశాంత్‌పై జీవితకాల నిషేధం విధించింది. దీన్ని సవాల్‌ చేస్తూ శ్రీశాంత్‌ కేరళ హైకోర్టును ఆశ్రయించడంతో బోర్డు చర్యలను కోర్టు కొట్టివేసింది. అయినప్పటికీ శ్రీశాంత్‌ను క్రికెట్లో పునరాగమనం చేసేందుకు బోర్డు అనుమతి ఇవ్వకపోవడంతో అతను మరోసారి కోర్టును ఆశ్రయించాడు. అందులో భాగంగా కోర్టుకు సమర్పించిన కౌంటర్‌ అఫిడవిట్‌లో బీసీసీఐ శ్రీశాంత్‌పై నిషేధాన్ని ఎత్తివేయడాన్ని సవాలు చేయడంతో కోర్టు జీవితకాల నిషేధాన్ని పునరుద్ధరించాలని ఆదేశించింది. దీంతో శ్రీశాంత్‌ కెరీర్‌కు మళ్లీ ఫుల్‌స్టాప్‌ పడినట్లైంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com