హైదరాబాద్ లో ఘరానా మోసం

- December 09, 2017 , by Maagulf
హైదరాబాద్ లో ఘరానా మోసం

హైదరాబాద్‌ సిటీ: ఓఎల్‌ఎక్స్‌లో ప్రకటన పోస్ట్‌ చేస్తాడు. నేను ఫారిన్‌లో ఉంటాను.. అమ్మ ఆంధ్రప్రదేశ్‌లో ఉంటుంది.. కారు శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఉంది... అమ్మాలనుకుంటున్నాను. మీరు వెళ్లి దాన్ని చూడండి.. తరువాత రేటు మాట్లాడుకుందాం అని నమ్మిస్తాడు. విమానా శ్రయం వద్ద నా స్నేహితురాలు ఉంటుంది.. కారుకు సంబంఽధించిన అన్ని క్లియరెన్స్‌లు తను చూసుకుంటుంది అని ఆమె ఫోన్‌ నెంబర్‌ ఇస్తాడు. కొనుగోలుదారుడు అతడు చెప్పిన అమ్మాయికి ఫోన్‌ చేయగానే. కారు పార్కింగ్‌ చేసి చాలా రోజులయింది. పార్కింగ్‌ ఫీజు చెల్లించిన తరువాతే కారును చూడనిస్తారని చెబుతుంది. కారు యజమానిగా చెప్పుకున్న వ్యక్తికి ఫోన్‌ చేయగా... మీరు నేను చెప్పిన అకౌంట్లో కొంత డబ్బు జమచేస్తే ఎయిర్‌పోర్టు నుంచి కారును విడిపించిన తర్వాత ఫైనల్‌ పేమెంట్‌ ఇచ్చేటప్పుడు మీరిచ్చిన డబ్బు మినహాయించుకొని మిగిలినది ఇవ్వండి అని చెబుతాడు. అతడి మాటలు నమ్మిన సదరు వ్యక్తి నిందితుడు చెప్పిన అకౌంట్లో డబ్బు జమచేసి ఫోన్‌ చేయగా... అది సరిపోలేదు. ఇంకొంత డబ్బు జమ చేయాలని చెబుతాడు. కొనుగోలుదారుడికి అనుమానం వచ్చే వరకూ అందినకాడికి దోచుకొని జారుకుంటారు. ఇలాంటి మోసానికి పాల్పడి హైదరాబాద్‌ నగరానికి చెందిన వ్యాపారి వద్ద రూ. 1.86 లక్షలు కాజేసిన ఉగాండ దేశస్థుడిని రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులు బెంగశూరులో అరెస్టు చేశారు.
రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఉగాండ దేశస్థుడైన ఫ్రెడ్రిక్‌ స్సెబుగెన్నాయ్‌ ఓఎల్‌ఎక్స్‌లో కారు అమ్మకానికి ఉందని 2016 అక్టోబర్‌లో నకిలీ ప్రకటన పోస్ట్‌ చేసి ఫోన్‌ నెంబర్లు ఇచ్చాడు. వనస్థలిపురానికి చెందిన కేబీ రెడ్డి ఆ ప్రకటన చూసి ఫోన్‌ చేశాడు. ఫ్రెడ్రిక్‌ కారు ఓనర్‌లా పరిచయం చేసుకొని నేను ఫారిన్‌లో ఉంటున్నాను. మా అమ్మ ఆంధ్రాలో ఉంటుంది. కారు శంషాబాద్‌ విమానాశ్రయంలో ఉంది.. చూడమని చెప్పాడు. నా స్నేహితురాలు సోనియారాజ్‌ అన్ని విషయాలు చూసుకుంటుందని ఆమె ఫోన్‌ నెంబర్‌ ఇచ్చాడు. కేబీ రెడ్డి సోనియారాజ్‌కు ఫోన్‌ చేయగా కారు పార్కింగ్‌ చేసి చాలా రోజులైందని.. దాన్ని చూడాలంటే పార్కింగ్‌ ఫీజు చెల్లించాలని చెప్పింది. రెడ్డి ఫ్రెడ్రిక్‌ను సంప్రదించగా.. నేను చెప్పిన అకౌంట్లో కొంత నగదు జమచేయండి తరువాత కారును చూసి ఫైనల్‌ పేమెంట్‌లో మీరిచ్చిన డబ్బును మినహాయించుకోమని చెప్పాడు.
బాధితుడు అతడు చెప్పిన ఐసీఐసీఐ బ్యాంకులో రూ. 1.86 లక్షలు జమ చేశాడు. ఆ తరువాత కారు గురించి అడగగా... ఇంకొంత డబ్బు జమ చేయాలన్నాడు. రెడ్డికి అనుమానం వచ్చి శంషాబాద్‌ వెళ్లి ఎంక్వైరీ చేయగా... అక్కడ కారు పార్క్‌ చేయలేదని... మీరు మోసపోయారని చెప్పారు. బాధితుడు రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడు ఇచ్చిన ఆధారాల ఆధారంగా నిందితుడు బెంగళూరులో ఉన్నట్టు గుర్తించి అక్కడికెళ్లి శాంతినగర్‌లో ఉన్న నిందితుడిని అరెస్టు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com