భారత్-మయన్మార్ మధ్య ఏడు కీలక ఒప్పందాలు

- May 11, 2018 , by Maagulf
భారత్-మయన్మార్ మధ్య ఏడు కీలక ఒప్పందాలు

నేపిటా:ఇండియా మయన్మార్ దేశాలు ఏడు అంశాలపై ఒప్పందాలు చేసుకున్నాయి. రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఆ దేశ ప్రతినిధులతోశాంతి భద్రతలు, అభివృద్ధి, రెకినే రాష్ట్రంలోని రోహింగ్యా ముస్లింలు బంగ్లాదేశ్‌కు తరలిపోవడం తదితర అంశాలపై చర్చించారు. గురువారం మయన్మార్ చేరుకున్న సుష్మా ఆ రాష్ట్ర కౌన్సిలర్ అంగ్‌సాన్‌సూకితో శుక్రవారం చర్చలు జరిపారు.
రెండు దేశాల ద్వైక్షిక సంబంధాలు, సరిహద్దు, శాంతి, రక్షణ, అభివృద్ధి తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. భారత్ సహాయంతో రెకినోలో జరుగుతున్న అభివృద్ధి పనులపై చర్చ జరిగింది. అంతేకాకుండా మంత్రి సుష్మా మయన్మార్ చీఫ్ కమాండర్ జనరల్‌ను కూడా కలిసారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య ఏడు అవగాహన ఒప్పందాలు కుదిరాయి. సరిహద్దు, టూరిజం, ఆరోగ్యం, విద్య తదితర అంశాలపై అవగాహన కుదిరిన అనంతరం ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత పటిష్టం కావాలని ఇరుదేశాల ప్రతినిధులు ఆకాంక్షించారు. 
ముఖ్యంగా రకినే రాష్ట్రంలో భారతదేశ సహకారంతో జరుగుతున్న ఇళ్ల నిర్మాణం వల్ల అక్కడి ప్రజలు మరింత మేలు జరగాలని సుష్మా పేర్కొన్నారు. రోహింగ్యాల సమస్యపై తమదేశ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ హామీనిచ్చారు. 2016 నుంచి అక్కడ ఉన్న రోహింగ్యాల సమస్యను ఆమె ప్రస్తావిస్తూ ఈ విషయంలో మయన్మార్‌లో పూర్వపరిస్థితులు నెలకొనడానికి తమ సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. కాగా 2016 ఆగస్టులో రోహింగ్యా మిలిటెంట్లు పోలీస్‌పోస్టులపై దాడికి పాల్పడిన నేపథ్యంలో జరిగిన హింసలో మిలటరీ ఆపరేషన్‌ను నిర్వహించారు. దీంతో ఏడు లక్షల మందికి పైగా రోహింగ్యాలు బంగ్లాకు తరలిపోయారు. వారి రాక బంగ్లాదేశ్‌కు పెద్ద సమస్యగా మారడమే కాక, ఈ సమస్యపై ప్రపంచదేశాలు సైతం స్పందించాయి.
ఆ దాడి అనంతరం రకినే రాష్ట్రంలో 30వేల మంది రోహింగ్యాలు మాత్రమే మిగిలారని రెడ్‌క్రాస్ సంస్థ అంచనా వేస్తోంది. అనంతరం మయన్మార్, బంగ్లాదేశ్‌ల మధ్య జరిగిన ఒప్పందం మేరకు వేల మంది రోహింగ్యాలు తిరిగి వచ్చారు. ఈ ఒప్పందం ప్రకారం రెండు సంవత్సరాల వ్యవధిలో రోహింగ్యాలు మయన్మార్ రాజధాని నేపీటాకు చేరుకోవాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com