హైదరాబాద్:జంట పేలుళ్ల కేసులో తీర్పు వాయిదా

- August 27, 2018 , by Maagulf
హైదరాబాద్:జంట పేలుళ్ల కేసులో తీర్పు వాయిదా

హైదరాబాద్‌ గోకుల్‌ చాట్, లుంబినీ పార్క్‌లో పేలుళ్ల తీర్పు వాయిదా పడింది. దాదాపు 11 ఏళ్లుగా విచారణ సాగింది. ఆగస్టు 7న కోర్టులో తుది వాదనలు ముగిసాయి. రికార్డులు భారీగా ఉన్నందునే తీర్పును న్యాయమూర్తి సెప్టెంబర్‌ 4కి వాయిదా వేశారు.

మరోవైపు పేలుళ్ల కేసు నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితులు డిమాండ్‌ చేశారు. ఉరి శిక్ష లేదా కాలు, కన్ను, చేయి తీసివేయాలన్నారు. చేయని తప్పుకు తాము 11 ఏళ్లుగా నరక యాతన అనుభవిస్తున్నామని జంట పేలుళ్ల కేసులో క్షతగాత్రులైన వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్నేళ్లుగా విచారణ సాగదీయడం పైనా ఆగ్రహం వ్యక్తం చేశారు.

సుమారు 11 ఏళ్ల కిందట 2007 ఆగస్టు 25న ఇండియన్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాదులు విధ్వంసం సృష్టించారు. గోకుల్‌ చాట్‌, లుంబినీ పార్కు ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌లో నిమిషాల తేడాలో శక్తిమంతమైన బాంబులు పేల్చారు. గోకుల్‌ చాట్‌లో 34 మంది, లుంబినీ పార్కులో 10 మంది మృతి చెందారు. ముజాహిదీన్ ముష్కర మూక మొత్తం 44 మందిని బలి తీసుకుంది. 60 మందికి పైగా గాయపడ్డారు. ఈ దారుణ ఘటనలు యావత్‌ దేశాన్ని ఉలికిపాటుకు గురిచేశాయి.

జంట పేలుళ్ల కేసులో తుది వాదనలు ఆగస్టు 7న ముగిసాయి. కేసు దర్యాప్తు చేస్తున్న తెలంగాణ కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులు మూడు చార్జిషీట్‌లు వేశారు. అప్పట్లో జంటపేలుళ్లు సంభవించిన వెంటనే దిల్‌సుఖ్‌నగర్‌లోని ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి వద్ద మరో బాంబును పోలీసులు గుర్తించి నిర్వీర్యం చేశారు. ఆ బాంబు ఆధారంగా విచారణ జరిపారు. 170 మంది సాక్షుల వాంగ్మూలం రికార్డు చేశారు. పేలుళ్లలో ఇండియన్‌ ముజాహిదీన్‌కు చెందిన ఎనిమిది మంది ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు.

వారిని అనిఖ్‌ షఫీక్‌ సయ్యద్‌, అక్బర్‌ ఇస్మాయిల్‌ చౌదరి, రియాజ్‌ భక్తల్‌, ఇక్బాల్‌ భక్తల్‌, మహ్మద్‌ తారీఖ్‌ అంజుం, షఫ్రుద్దీన్‌ టార్కస్‌, సాదిక్‌ ఇష్రార్‌ అహ్మద్‌ షేక్‌, అమీర్‌ రిజా ఖాన్‌గా నిర్ధారించారు. వీరిలో రియాజ్‌ భక్తల్‌, ఇక్బాల్‌ భక్తల్‌, అమిర్‌ రిజా ఖాన్‌ పరారీలో ఉండగా.. అనిఖ్‌ షఫీక్‌ సయ్యద్‌, అక్బర్‌ ఇస్మాయిల్‌ చౌదరి, మహ్మద్‌ తారీఖ్‌ అజుం, షఫ్రుద్దీన్‌ టార్కస్‌, సాదిక్‌ ఇష్రార్‌ అహ్మద్‌ షేక్‌ చర్లపల్లి జైలులో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్నారు. వీరిని 2013లో మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం టీం అరెస్టు చేసి… రాష్ట్ర పోలీసులకు అప్పగించింది. అనిఖ్‌ షఫీక్‌ సయ్యద్‌ను మహారాష్ట్ర పోలీసులు విచారించగా.. హైదరాబాద్‌లో జంట పేలుళ్లకు పాల్పడినట్లు అంగీకరించాడు. లుంబినీ పార్కులోని లేజేరియంలో, గోకుల్‌ చాట్‌లోని ఐస్‌క్రీం మిషన్‌కు ఇంప్రూవైజ్డ్‌ ఎక్స్‌ప్లోజివ్‌ డివైజ్‌ అమర్చినట్లు ఒప్పుకున్నాడు.

తెలంగాణ కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ పోలీసులు.. అతని 5 పేజీల స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. హైదరాబాద్‌లో ఎలా పేలుళ్లకు కుట్ర పన్నారనే విషయాన్ని పోలీసులకు చెప్పాడు. పేలుళ్లకు ముందు హబ్సిగూడలోని ఒక ఇంట్లో ఉండి కుట్రకు ప్లాన్‌ చేసినట్లు వివరించాడు.హైదరాబాద్‌ గోకుల్‌ చాట్, లుంబినీ పార్క్‌లో పేలుళ్ల తీర్పు వాయిదా పడింది. దాదాపు 11 ఏళ్లుగా విచారణ సాగింది. ఆగస్టు 7న కోర్టులో తుది వాదనలు ముగిసాయి. రికార్డులు భారీగా ఉన్నందునే తీర్పును న్యాయమూర్తి సెప్టెంబర్‌ 4కి వాయిదా వేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com