హైదరాబాద్ 10 వేల సీసీ కెమెరాలను ఏర్పాటు..
- December 19, 2015
, by Maagulf
హైదరాబాదు నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలగాణ మంత్రి కెటి రామారావు చెప్పారు. శనివారంనాడు ఆయన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన 77 కమ్యూనిటీ సీసీ కెమెరాలను ప్రారంభించారు. హైదరాబాద్ నగరవ్యాప్తంగా 10 వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. తెలంగాణ వస్తే కరెంట్ కష్టాలు వస్తాయని అపోహలు సృష్టించారని విమర్శించారు. స్వరాష్ట్రంలో నిరంతరాయంగా కరెంట్ సరఫరా చేస్తున్నామని వివరించారు. విశ్వనగర్ విజన్తో ముందుకెళ్తున్నామని అన్నారు. మెట్రోను నగర శివార్ల వరకు విస్తరిస్తామని కూడా చెప్పారు. హైదరాబాద్ నగరానికి గోదావరి జలాలు తీసుకొచ్చి ప్రజల దాహం తీరుస్తామని వెల్లడించారు. హైదరాబాద్ అభివృద్ధిపై గత పాలకులు సోయే లేకుండా పోయిందని దుయ్యబట్టారు. నగర ప్రజల తాగునీటి కోసం 30 టీఎంసీల సామర్థ్యం గల 2 రిజర్వాయర్లను నిర్మిస్తున్నామని కెటిఆర్ చెప్పారు. నగర ప్రజలకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో కోటి మంది జనాలు నివసిస్తున్నారని చెప్పారు. హైదరాబాద్లో గూగుల్ క్యాంపస్ ఏర్పాటు చేస్తామని పిచాయ్ ప్రకటించినవిషయాన్ని గుర్తు చేశారు. హైదరాబాద్లో 36 మోడల్ మార్కెట్లను నిర్మించాలని సీఎం నిర్ణయించారని తెలిపారు. లైబ్రరీ వ్యవస్థ ప్రక్షాళన నగరంలో లైబ్రరీ వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సి ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సచివాలయంలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. త్వరలో తాను గ్రంథాలయాలను సందర్శిస్తానన్నారు. హైదరాబాద్ నగరంలో లైబ్రరీ వ్యవస్థను బలోపేతం చేస్తామని అన్నారు. ఇందుకు సంబంధించి పది రోజుల్లో నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించామన్నారు. నివేదిక అందాక అందరం కూర్చుండి లైబ్రరీల పరిస్థితులపై చర్చిస్తామన్నారు. నూటికి నూరు శాతం లైబ్రరీలకు కొత్త రూపురేఖలు తీసుకొస్తామన్నారు