ఢిల్లీలో శపథం చేసిన చంద్రబాబు
- October 27, 2018
ఢిల్లీ:కాస్కో మోడీ అంటూ యుద్ధం ప్రకటించారు చంద్రబాబు. మాపైనే కుట్ర చేస్తావా.. ఇక నిన్ను కూలదోస్తా చూడు అంటూ ఢిల్లీలో శపథం చేశారు. ఇక బ్రతిమిలాడుకోవడాలు.. కంప్లైట్ చేసుకోవడాలు ఉండవ్ అని కేంద్రానికి వార్నింగ్ ఇచ్చిన ఏపీ సీఎం.. ఫైనల్ కంక్లూజన్ కోసమే ఢిల్లీ వచ్చానని కుండబద్ధలు కొట్టేశారు.
మోడీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు సమాఖ్య స్ఫూర్తిపై గగ్గోలు పెట్టారు. అప్పటి కేంద్రాన్ని బజారుకీడ్చారు. ప్రధాని కాగానే సీన్ రివర్స్. దీంతో సమాఖ్య స్ఫూర్తి కోసం ఇప్పుడు అదే కేంద్రంపై మరో తిరుగుబాటు స్వరం సౌండ్ పెంచింది. ఢిల్లీ గడ్డపైనే చంద్రబాబు రూపంలో గర్జించింది.
జగన్ పై కత్తి దాడి తర్వాత అలర్టైన ఏపీ ప్రభుత్వం.. ఆపరేషన్ గరుడపై ఫోకస్ చేసింది. హీరో శివాజీ చెప్పినట్లే జరుగుతుండటంతో కేంద్రం కుట్ర రాజకీయాలపై కడిగిపారేశారు చంద్రబాబు. ఇన్నాళ్లు ఒక లెక్క.. ఇక నుంచి ఇంకో లెక్క అంటూ వార్నింగ్ డోస్ పెంచారు. దేశమంతా తిరిగి ఎన్డీఏ సర్కార్కు అసలు సిసలు పొలిటికల్ సినిమా చూపిస్తానని… మోడీ అసలు రంగు బయటపెడతానని అన్నారు.
ఎన్డీయే నుంచి తప్పుకున్నాక.. టీడీపీ, బీజేపీ మధ్య ఉప్పు నిప్పులా మారింది పరిస్తితి. ఏపీకి దక్కాల్సిన నిధుల దగ్గర్నుంచి విభజన హామీల విషయంలో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో రోజు విడిచి రోజు జరుగుతున్న ఐటీ దాడులు ఏపీ పాలిటిక్స్ ను మరింత హీటెక్కించాయి. కక్షపూరిత రాజకీయాలపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. మోడీపై యుద్ధం ప్రకటించినందుకు తనపై కూడా దాడులు జరుగుతాయని అన్నారాయన.
జాతీయస్థాయిలో పొత్తు లేకుండా అధికారంలోకి రావటం కష్టమన్న చంద్రబాబు.. ప్రజలు బీజేపీకి ఆ అవకాశం కల్పించారని అన్నారు. కానీ, అదే ప్రజల పాలిట శాపంగా మారిందన్నారు చంద్రబాబు. వైసీపీతో కలిసి ఏపీలో కుట్ర రాజకీయాలు చేస్తోందని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో అలజడి సృష్టించాలని చూస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. జగన్ పై దాడి ఘటనలో బీజేపీ రియాక్షన్ ఉదాహరణ అన్నారు.
ఇక ఆపరేషన్ గరుడ విషయాలు శివాజీకి ఎలా తెలుసో తమకు తెలియదన్నారు ఏపీ సీఎం. అన్నీ ఆయన చెప్పినట్టే జరుగుతుండడం చూస్తుంటే.. కేంద్రం చేస్తున్న కుట్ర నిజమే అనిపిస్తోందన్నారు.
ఆపరేషన్ గరుడ లీక్స్ ను మొదట్లో లైట్ తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. వరుస పరిణామాలతో అప్రమత్తమైంది. ఏపీలో మోడీ కుట్రలను జాతీయ స్థాయిలో ప్రచారం కల్పిస్తూనే సమాఖ్య స్పూర్తి దెబ్బతీసేలా మోడీ చేస్తున్న రాజకీయాలను కడిగేస్తామంటున్నారు. దీంతో ఇక నుంచి పొలిటికల్ సినిమా ఎలా ఉంటుందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.
తాజా వార్తలు
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్









