తెలంగాణ:ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం

- January 27, 2019 , by Maagulf
తెలంగాణ:ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం

తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. జూబ్లిహిల్స్, బంజారహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, కూకట్ పల్లి, ఉప్పల్, రాంనగర్ తో పాటు పలు ప్రాంతాలు తడిసి ముద్దైపోయాయి. రోడ్లపై నీరు నిలిచిపోవటంతో జనానికి వాన కష్టాలు తప్పలేదు. పంజాగుట్ట, అమీర్ పేట్, జూబ్లిహిల్స్ ప్రాంతాల్లో రోడ్లు చెరువులను తలపించాయి. వర్షంతో సిటీ జనాలకు ఇబ్బంది కలగకుండా జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ పలు ప్రాంతాలను పరిశీలించారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. శనివారం ఉదయం నుంచి పలు చోట్ల జల్లులు పడ్డాయి. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్, భీంపల్లి, కన్నూరు, దేశరాజ్‌పల్లి, గూడూరు తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కమలాపూర్‌లోని పర్కాల – హుజురాబాద్ రహదారిపై వరద నీరు నిలిచి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రధాన రహదారి వెంట నూతనంగా వేసిన విద్యుత్ లైన్ స్తంభాలు నేలకొరిగాయి.

అకాల వర్షం తెలంగాణ రైతాంగానికి కన్నీరు మిగిల్చింది. మార్కెట్లో ఆరబోసిన పంటలు నీటిపాలయ్యాయి. ఖమ్మం జిల్లా నెలకొండపల్లి, వనపర్తి జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో ధాన్యం తడిసిపోయింది. నిజామాబాద్ జిల్లాలో ఆరబోసిన పసుపు, కరీంనగర్ జిల్లాలో మొక్కజొన్న పంట దెబ్బతింది. మామిడితోటల్లో పూత రాలిపోయింది.

తెలంగాణలో పలు చోట్ల ఏడు సెంటీమీటర్లకుపైగా వర్షపాతం నమోదైంది. అత్యధికంగా సిద్దిపేట జిల్లా నాగనూర్ 10 సెంటీమీటర్లు, రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దలింగాపురంలో 8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అకాల వర్షంతో తెలంగాణ వ్యాప్తంగా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. రెండో రోజుల క్రితం పెరిగిన ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. అకాశం మేఘావృతం కావటంతో పొడివాతావరణం నెలకొంది.

తూర్పు విదర్భ దాని పరిసర ప్రాంతాలలో ఏర్పడిన ఉపరిత ఆవర్తనం కారణంగానే వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది హైదరాబాద్ వాతావరణ శాఖ. ఇవాళ, రేపు కూడా పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. తెలంగాణ, ఏపీలో రాగల రెండు రోజుల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ రోజు ఒకటి రెండు చోట్ల వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉందని…రేపు రాష్ట్ర వ్యాప్తంగా తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com