ప్రముఖ మీడియా అధినేత అనుమానాస్పద మృతి
- February 01, 2019
ఏ.పి:పారిశ్రామికవేత్త, కోస్టల్ బ్యాంక్ ఛైర్మన్ చిగురుపాటి జయరాం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కృష్ణా జిల్లా నందిగామ మండలం ఐతవరం సమీపంలో జాతీయ రహదారి పక్కన ఆపి ఉన్న కారులో డెడ్బాడీ గుర్తించారు. ఇది ఆత్మహత్యా, హత్యా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టినా ప్రాధమికంగా దొరికిన ఆధారాల్ని బట్టి హత్యగానే నిర్థారణకు వచ్చారు. కారులో మద్యం బాటిళ్లు ఉండడం, వెనుక సీట్లో ఆయన డెడ్బాడీ పడి ఉండడంతో ఏం జరిగిందన్నది విశ్లేషించే ప్రయత్నం చేశారు. తలపై చిన్న గాయం కూడా అయినట్టుగా ఆనవాళ్లు ఉండడంతో హత్య అన్న అనుమానాలు బలపడ్డాయి. అలాగే చేతులు రంగు మారడం బట్టి చూస్తే విష ప్రయోగం జరిగిందా అన్న డౌట్ కూడా వస్తోంది. దర్యాప్తులో భాగంగా సూర్యాపేట, చిల్లకల్లు టోల్గేట్ల వద్ద ఫుటేజ్ పరిశీలించారు. కారులో ఆయనతోపాటు ఎవరైనా ఉన్నారా.. ఏ సమయానికి ఆయన అక్కడికి వచ్చారు అన్నది నిర్థారించుకున్నారు. టోల్గేట్ ఫుటేజ్ బట్టి చూస్తే తెల్ల చొక్కా వేసుకున్న ఓ వ్యక్తి కారు నడిపినట్టు తేలింది. ప్రస్తుతం క్లూస్టీమ్ను కూడా రంగంలోకి దించారు. కాల్డేటాను కూడా పరిశీలించేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
జనవరి 21న విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లిన ఆయన.. 10 రోజులు అక్కడే ఉన్నారు. నిన్న రాత్రి తిరిగి విజయవాడ వెళ్తూ మధ్యలో ఇలా శవమై కనిపించారు. ఘటనా స్థలం వద్ద ఓసారి చూస్తే… చిగురుపాటి జైరామ్ కారు రోడ్డు పక్కన ఆపినట్టుగా కాకుండా కిందకు దూసుకొచ్చినట్టుగా కనిపిస్తోంది. కారు డ్రైవ్ చేసిన వ్యక్తి స్పాట్లో లేకపోవడం.. కారు రోడ్డు పక్కకు దూసుకొచ్చినా ఆపడం చూస్తే.. యాక్సిడెంట్ జరిగినట్టుగా సీన్ క్రియేట్ చేసేందుకు ప్రయత్నం జరిగిందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇది హత్యేనని నందిగామ డీఎస్పీ చెప్తున్నారు. వీలైనంత త్వరగా కేసు ఛేదిస్తామంటున్నారు.
చిగురుపాటి జయరాం డెడ్బాడీ ఉన్న కారు కూడా ఆయనది కాదు. జయరాం డ్రైవింగ్ చేయరని సన్నిహితులు చెప్తున్నారు. అలాంటప్పుడు కారు డ్రైవర్ ఏమైనట్టు.. అతను ఎక్కడకు వెళ్లిపోయాడు.. అలాగే కారులో ఇంకా ఎవరైనా ఉన్నారా అన్నది కూడా ఆరా తీస్తున్నారు. జైరామ్కు మద్యం అలవాటు కూడా లేదని.. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తప్పించి ఆల్కహాల్ జోలికి వెళ్లరంటున్నారు. అదే నిజమైతే కారులో మద్యం బాటిల్లు ఎందుకు ఉన్నాయి.. ఈ మర్డర్ ప్లాన్ ఎవరిది అన్నది తేల్చడం పోలీసుకు సవాల్గా మారింది.
NRI అయిన జయరాం.. కొన్నేళ్ల కిందట తిరిగి ఇక్కడకు వచ్చారు. ప్రస్తుతం ఆయన భార్యాపిల్లలు ఫ్లోరిడాలోనే ఉంటున్నారు. వ్యాపారవేత్తగా ఇటీవల కొన్ని ఒడిదుడుకులకు లోనైనా అన్నింటినీ చక్కదిద్దే ప్రయత్నాలు చేస్తున్నారు. ఐతే.. అనూహ్యంగా ఇప్పుడు చనిపోవడం కలకలం రేపింది. తెనాలిలోని ఓ సామాన్య కుటుంబంలో పుట్టిన చిగురుపాటి జయరాం.. 1988లోనే జెనటిక్స్లో పీహెచ్డీ చేశారు. అమెరికా వెళ్లాక ఫార్మారంగంలో రాణించారు. మొదట్లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ విస్తరణలో కీలకపాత్ర పోషించిన జయరాం.. తర్వాత సొంతంగానే వ్యాపారం మొదలుపెట్టారు. సక్సెస్ అయ్యారు. ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకున్నారు. జినోటెక్ లేబొరేటరీస్, హేమరస్ ఫార్మా కంపెనీలు నెలకొల్పారు. త్రిమూర్తి ప్లాంట్ సైన్సెస్ పేరుతో వ్యవసాయరంగంలోనూ పరిశోధనలు చేశారు. మరికొన్ని రంగాల్లోనూ వ్యాపారాన్ని విస్తరించారు. కోస్టల్ బ్యాంక్ను ఏర్పాటు చేశారు. కొన్నేళ్ల కిందట ఎక్స్ప్రెస్ టీవీని కూడా ప్రారంభించి మీడియారంగంలోకి వచ్చారు. కొన్ని ఇబ్బందుల కారణంగా ఆ ఛానెల్ మూతపడింది. ఐతే.. మిగతా వ్యాపారాలను మాత్రం కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అనుమనాస్పదంగా జయరాం ప్రాణాలు కోల్పోవడంతో అసలేం జరిగిందన్నది మిస్టరీగా మారింది.
చిగురుపాటి జయరాంను చంపింది ఎవరు.. ఎందుకు దీన్ని యాక్సిడెంట్గా క్రియేట్ చేయాలనుకున్నారు. వ్యాపారంలో ఆర్థిక లావాదేవీల వివాదమే ఈ హత్యకు కారణమా అన్న దానిపై ఇప్పుడు లోతైన దర్యాప్తు చేయనున్నారు. వేలకోట్ల ఆస్తులు ఉన్న వ్యక్తి.. సూసైడ్ చేసుకునే అవకాశం లేదు. అలాంటప్పుడు తెరవెనుక ఏం జరిగిందన్నదే ఇప్పుడు మిస్టరీగా మారింది. జయరాంకి కొన్నాళ్లుగా భార్యతో విభేదాలున్నాయి. ఈ గొడవల కారణంగా విడిగానే ఉంటున్నట్టు తెలుస్తోంది. వేరే మహిళతో జయరాం సన్నిహితంగా ఉండడం భార్యాభర్తల మధ్య వివాదానికి కారణమైందంటున్నారు. వ్యక్తిగతంగా ఈ వివాదం తప్ప మిగతా సమస్యల గురించి ఇతరులకు పెద్దగా ఏమీ తెలియదు. ఈ నేపథ్యంలో హత్యకు దారి తీసిన పరిస్థితులు ఏంటన్నది దర్యాప్తులో తేలనుంది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







