భారత కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం

- March 23, 2019 , by Maagulf
భారత కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం

కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జమ్మూ కశ్మీర్‌లో వేర్పాటువాద నాయకులపై ఉక్కుపాదం మోపుతున్న కేంద్రం, తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. వేర్పాటువాది యాసిన్ మాలిక్ నేతృ త్వంలోని జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్-JKLF ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. జమ్మూ కశ్మీర్‌ను భారతదేశం నుంచి విడదీయాలనే ప్రయత్నాలకు J.K.L.F ఊతమిస్తోందని, అందుకే ఆ సంస్థను నిషేధిస్తున్నామని ప్రభుత్వం పేర్కొంది. ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశంలో జమ్మూ కశ్మీర్ వ్యవహారాలు, దేశ భద్రతపై చర్చించారు. అనంతరం చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కిందం J.K.L.Fను నిషేధించారు. ఉగ్రవాద సంస్థలతో J.K.L.F సంబంధాలు కలిగి ఉందని, జమ్మూకశ్మీర్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో ఉగ్రవాదం-అతివాదానికి సాయం చేస్తోందని ప్రభుత్వం తెలిపింది. కశ్మీర్‌లో వేర్పాటువాద కార్యకలాపాలను J.K.L.F ముందుండి నడిపిస్తోందని, 1989 లో జరిగిన కశ్మీరీ పండిట్ల హత్యల్లోనూ J.K.L.Fకు ప్రమేయముందని కేంద్రం వెల్లడించింది. దేశానికి ముప్పుగా పరిణమించిన వేర్పాటువాద గ్రూపులు, వాటి కార్యకలాపాలను అణచివేసే చర్యల్లో భాగంగా J.K.L.Fను బ్యాన్ చేసినట్లు ప్రభుత్వం వివరించింది.

 

పాకిస్థాన్ జాతీయుడైన అమానుల్లాఖాన్ 1970లలో బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్‌లో J.K.L.Fను ఏర్పాటుచేశాడు. 1971లో జేకేఎల్‌ఎఫ్ సభ్యుడొకరు శ్రీనగర్ నుంచి జమ్ముకు వెళ్తున్న ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని హైజాక్ చేయడంతో ఆ సంస్థ ప్రాచుర్యంలోకి వచ్చింది. నిషేధిత J.K.L.Fపై చాలా ఆరోపణలు ఉన్నాయి. మూడు దశాబ్దాల క్రితం జరిగిన కేంద్ర మాజీ హోంమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ కుమార్తె రుబయా సయీద్ కిడ్నాప్ కేసులో J.K.L.F హస్తముందనే ఆరోపణలున్నాయి. శ్రీనగర్‌లో నలుగురు భారత వాయుసేన సిబ్బందిని కాల్చిచంపిన కేసులో J.K.L.F పాత్రపై అనుమానాలున్నాయి. 1984లో బ్రిటన్‌లోని భారత దౌత్యాధికారి రవీంద్ర మాత్రే కిడ్నాప్, హత్య కేసులోనూ J.K.L.F ప్రమేయముంది. ఈ హత్య జరిగిన తర్వాత J.K.L.F కార్యకర్త మక్బూల్ భట్‌ను ప్రభుత్వం ఉరి తీసింది. J.K.L.F జమ్మూ కశ్మీర్ పోలీసులు మొత్తం 37 కేసులు నమోదు చేశారు. జమ్మూ కశ్మీర్‌లో ప్రభుత్వం నిషేధించిన సంస్థల్లో J.K.L.F రెండవది. గతంలో జమాతే ఇస్లామీ జమ్ముకశ్మీర్ సంస్థపై కేంద్రం నిషేధం విధించింది. ఐతే J.K.L.Fను నిషేధించడంపై జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ మండిపడ్డారు. ఇలాంటి చర్యలతో కశ్మీర్ ఓపెన్ ఎయిర్ జైలుగా మారుతుందని ఆమె అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com