వీరిని ఐపీఎల్ రాత్రికి రాత్రే ధనవంతులను చేసింది

- March 23, 2019 , by Maagulf
వీరిని ఐపీఎల్ రాత్రికి రాత్రే ధనవంతులను చేసింది

పది రోజుల్లో పండగ వస్తుందన్నంత ఆనందం క్రికెట్ అభిమానులకు ఐపీఎల్ అంటే. నెల రోజుల ముందు నుంచే ఐపీఎల్ గురించి చర్చలు. అనుకున్న రోజు రానే వచ్చింది. అందరూ టీవీలకు అతుక్కుపోయి అరుపులు కేకలతో గేమ్‌ని ఎంజాయ్ చేస్తుంటారు. ప్రపంచంలోనే ధనిక క్రికెట్ లీగ్ ఐపీఎల్ కావడంతో ఇందులో ఒక్క సీజన్ ఆడినా చాలనుకునే క్రీడాకారులెందరో. ఇందులో పాల్గొన్న ఆటగాళ్లకు ఇచ్చే పారితోషికంతో పాటు ప్రైజ్ మనీ కూడా భారీ స్థాయిలోనే ఉంటుంది. గత ఏడాది ఐపీఎల్ చాంపియన్‌లో విజేతగా నిలిచిన చెన్నై జట్టుకు రూ.20 కోట్ల ప్రైజ్ మనీ అందజేశారు. రన్నర్స్‌గా నిలిచిన హైదరాబాద్ టీమ్‌కు రూ.12.5 కోట్లు దక్కాయి. విజేతగా నిలవక పోయినా ఐపీఎల్‌లో ఆడిన ప్రతి ఆటగాడికి నగదు బాగానే అందుతుంది. బంతిని ఎక్కువ సార్లు బౌండరీ దాటించినా, ఎక్కువ వికెట్లు తీసినా, జబర్ధస్త్ క్యాచ్‌లు పట్టినా నోట్ల వర్షం కురుస్తుంది.

 

ఇక ఐపీఎల్ ఆటగాళ్లకు అందించే అవార్డుల గురించి తెలుసుకుందాం..
అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్‌కు ఆరెంజ్ క్యాప్ ఇస్తారు. వీరికి రూ.10 లక్షల ప్రైజ్ మనీ అందిస్తారు. తొలిసారిగా ఆరెంజ్ క్యాప్ అందుకున్న క్రికెటర్ షాన్ మార్ష్ అందుకున్నాడు. ఆ తరువాతి వరుసలో క్రిస్‌గేల్, డేవిడ్ వార్నర్ రెండేసి సార్లు ఆరెంజ్ క్యాప్ విన్నర్స్‌గా నిలిచారు. సచిన్ టెండూల్కర్, మాథ్యూ హెడెన్, విరాట్ కోహ్లీ, మైక్ హస్సీ, రాబిన్ ఉతప్ప, కేన్ విలియమ్ సన్ ఒక్కోసారి ఆరెంజ్ క్యాప్ అందుకున్నారు.

అత్య‌ధిక వికెట్లు తీసిన బౌలర్ కు ప‌ర్పుల్ క్యాప్ ఇస్తారు. ఈ క్యాప్ విన్న‌ర్ కు కూడా రూ.10 ల‌క్ష‌లు అంద‌జేస్తారు. తొలిసారి పాక్ ఆట‌గాడు సొహైల్ త‌న్వీర్ ప‌ర్పుల్ క్యాప్ అందుకున్నాడు. భువ‌నేశ్వ‌ర్, డ్వేన్ బ్రేవో ఇప్ప‌టి వ‌ర‌కు రెండు సార్లు ఈ క్యాప్‌ను అందుకున్నారు. ఆర్పీ సింగ్‌, ప్ర‌జ్ఞాన్ ఓజా, ల‌సిత్ మ‌లింగ‌, మోర్నీ మోర్కెల్‌, మోహిత్ శ‌ర్మ‌, ఆండ్రూ టై ఒక్కోసారి ఆరెంజ్ క్యాప్ విన్న‌ర్స్‌గా నిలిచారు.

మరిన్ని ప్రైజ్‌ల వివ‌రాలు
లీగ్ స్థాయిలో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న ఆట‌గాడికి రూ.ల‌క్ష‌తో పాటు ట్రోఫీ అంద‌జేస్తారు. ప్లే ఆఫ్‌లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన ఆట‌గాడికి రూ.5 ల‌క్ష‌ల‌తో పాటు ట్రోఫీ అంద‌జేస్తారు. వివో ప‌ర్‌ఫెక్ట్ క్యాచ్ ప‌ట్టిన ఆట‌గాడు రూ.ల‌క్ష ప్రైజ్‌మ‌నీతో పాటు వివో మొబైల్ అందుకుంటాడు. సీజ‌న్ మొత్తానికి అయితే రూ.10 ల‌క్ష‌లు, ట్రోఫీ వీవీ మొబైల్ సంస్థ అందజేస్తుంది. ప్రేక్ష‌కుల ఓట్ల ద్వారా విజేత‌ను నిర్ణ‌యిస్తారు.

సీజ‌న్ మొత్తానికి పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్థానంలో ఉన్న ఆట‌గాడికి మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ ప్రైజ్ ఇస్తారు. రూ.10 ల‌క్ష‌ల‌తో పాటు ట్రోఫీని అంద‌జేస్తారు. భ‌విష్య‌త్‌లో క్రికెట్‌లో రాణిస్తాడ‌ని న‌మ్మ‌కమున్న ఆట‌గాడికి ఎమర్జింగ్ ప్లేయ‌ర్ అవార్డు కింద రూ.10 ల‌క్ష‌లు, ట్రోఫీ అంద‌జేస్తారు. అయితే 1992 త‌రువాత జ‌న్మించి, 5 క‌న్నా త‌క్కు వ టెస్ట్ మ్యాచ్‌లు, 25 కంటే త‌క్కువ ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి ఉండాలి. ఒక‌సారి ఈ అవార్డు అందుకుంటే మ‌రోసారి ఇవ్వ‌రు.

మ్యాచ్‌లో ఎక్కువ స్టైక్ రేట్ న‌మోదు చేసిన ఆట‌గాడికి టాటా నెక్సాన్‌ సూపర్‌ స్ట్రైకర్ అవార్డు ఇస్తారు. ఒక మ్యాచ్ అయితే రూ.ల‌క్ష‌, సీజ‌న్ మొత్తానికి అయితే టాటా నెక్సాన్ కారు అంద‌జేస్తారు. మ్యాచ్ లో ఆరు నుంచి 15 బంతులెదుర్కొవాలి. సీజ‌న్‌కు అయితే 7 మ్యాచ్‌లు ఆడి ఉండాలి. మైదానంలో ఉత్త‌మ ప్ర‌వ‌ర్త‌న‌, ఆత్మ‌విశ్వాసం, ఒత్తిడి వంటి అంశాల‌ను ప‌రిగిణ‌లోకి తీసుకుని ఎఫ్‌బీబీ స్టైలిష్‌ ప్లేయర్ అవార్డు అంద‌జేస్తారు. మ్యాచ్‌కు రూ.ల‌క్ష‌తో పాటు ట్రోఫీ, సీజ‌న్‌కు రూ.10 ల‌క్ష‌లు ట్రోఫీ అంద‌జేస్తారు. ఎక్కువ మ్యాచ్‌ల‌లో విజేతగా నిలిచిన వారినే సీజ‌న్ విజేత‌గా ప్ర‌క‌టిస్తారు. మైదానంలో వినూత్న ఆలోచనను విజయవంతంగా అమలు చేసిన ఆటగాడికి స్టార్‌ ప్లస్‌ నయీ సోచ్ అవార్డు ఇస్తారు. మ్యాచ్‌కు రూ.ల‌క్ష‌, ట్రోఫీ అంద‌జేస్తారు. సీజ‌న్ మొత్తానికి రూ.10 ల‌క్ష‌లు, ట్రోఫీ అంద‌జేస్తారు.ఇంకా అంపైర్లకు, పిచ్ త‌యారు చేసిన సిబ్బందికి కూడా అవార్డులు ఉంటాయి. మరి ఇప్పుడు జరుగుతున్న ఈ ఐపిఎల్‌లో విజేతలెవరో చూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com