సీఐఐఎల్ కేంద్రాన్ని తెలుగు రాష్ట్రాలకు తరలించండి : వెంకయ్య నాయుడు

- August 16, 2019 , by Maagulf
సీఐఐఎల్ కేంద్రాన్ని తెలుగు రాష్ట్రాలకు తరలించండి : వెంకయ్య నాయుడు

మైసూరులోని సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ (సీఐఐఎల్) ఆధీనంలో గల తెలుగు క్లాసికల్ అభివృద్ధి సంస్థను తెలుగు రాష్ట్రాల్లో అనువైనచోటకు తరలించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోక్రియాల్‌కు సూచించారు. ఉప రాష్టప్రతి నివాసంలో రమేష్ పోక్రియాల్, ఆ శాఖ ఉన్నతాధికారులతో సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ తెలుగు, రీజనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ నెల్లూరు అంశాలపై ఉప రాష్ట్రపతి గురువారం చర్చించారు. తెలుగు భాషాభివృద్ధికోసం కేంద్రం ఏర్పాటు చేసిన తెలుగు క్లాసికల్ అభివృద్ధి సంస్థను మరింత బలోపేతం చేయాలని కేంద్ర మంత్రికి సూచించారు. ఈ సంస్థను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అనువైన ప్రదేశానికి తరలించాలని కేంద్ర మంత్రిని కోరారు. నెల్లూరులో ఏర్పాటు కానున్న రిజనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కేంద్రానికి సంబంధించిన ప్రాజెక్టు నివేదికను వేగవంతం చేయాలని కేంద్ర మంత్రికి ఉప రాష్ట్రపతి సూచించారు. ఈ కేంద్రాన్ని అప్పటి కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రిగా ఉన్న ప్రకాశ్ జావడేకర్ చేతుల మీదుగా 2016 డిసెంబరులో ప్రారంభించినట్టు వెల్లడించారు. ఈ కేంద్రం ఏర్పాటుకు నెల్లూరులోని వెంకటాచలం మండలం సమీపంలో కనుపురు వద్ద 50 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా కేటాయించిన అంశాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అలాగే ఏపీ విభజన చట్టం కింద మంజూరు చేసిన వివిధ విద్యా సంస్థల ఏర్పాటు, సంస్థల పురోగతి తదితర అంశాలపై కూడా ఈ సమావేశంలో ఉప రాష్ట్రపతి కేంద్ర మంత్రితో చర్చించారు. ఈ సమావేశంలో కేంద్ర విద్యా శాఖ కార్యదర్శి ఆర్.సుబ్రహ్మణ్యం, ఎన్‌సిఈఆర్‌టీ డైరెక్టర్ హృషికేష్ సేనాపతి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com