దుబాయ్ లో సంక్రాంతి 'వేవ్'

- January 10, 2016 , by Maagulf

ఎన్నో ప్రపంచ రికార్డులకు నెలవైన దుబాయ్ లో తెలుగువారు సంక్రాంతి సంబరాలను వారం రోజుల ముందుగానే జరుపుకున్నారు. దుబాయ్ లోని జబీల్ పార్క్ లో శుక్రవారం ఉదయం నుండి సాయంత్రం వరకు తెలుగువారు ఆనందోత్సాహాల నడుమ సంక్రాంతి శోభను ఆస్వాదించారు.ప్రఖ్యాత తెలుగు అసోసియేషన్ 'వేవ్ రిసొనెన్స్ ఈవెంట్స్' ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సంక్రాంతి సంబరాలలో సుమారు 800 మంది పాల్గొనడం విశేషం. గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రతి సంధర్భాన్ని పురస్కరించుకొని అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ దుబాయ్ లోని తెలుగు వారికి ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తున్న తెలుగు అసోసియేషన్ 'వేవ్' కు అందరు శుభాభినందనలు, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసారు. ముఖ్యంగా 'వేవ్' వ్యస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి గీతా రమేష్ రావెళ్ళ, 'వేవ్' విజయ సారధి శ్రీ రమేష్ రావెళ్ళ ను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు.

నేటి సంక్రాంతి సంబరాలు అనేక విశేష కార్యక్రమాల సమాహారంగా కొనసాగింది. అన్ని తరగతుల వారిని అలరించే అనేక కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారులకు భోగి పళ్ళతో అభిషేకం చేసారు. తెలుగింటి ఆడపడుచులు తమకు ప్రాణప్రదమైన ముత్యాల ముగ్గులతో ప్రాంగణానికి సంక్రాంతి శోభను తెచ్చారు. కేరింతల నడుమ పిల్లలు, పెద్దలు రంగు రంగుల గాలిపటాలతో ఆకాశానికి తోరణాలు కట్టారు. సాంప్రదాయ దుస్తుల వేషధారణతో ఒక ప్రక్క మరియు ఫాన్సీ డ్రస్సుల వేషధారణతో మరో ప్రక్క యువత అందరికీ కనువిందు చేసారు. వివిధ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేసి వారిలో ప్రోత్సాహం కలిగించారు. విందులో తెలుగు వంటకాల రుచి చూపించి అందరినీ ఆహ్లాదపరిచారు. ఆహ్వానితుల పట్ల అసోసియేషన్ కనబరచిన ఆదరణ అందరి మన్నలను చూరగొంది. బంపర్ ప్రైజ్ ఉన్న లక్కీ డిప్ హైలైట్ గా నిలిచింది.

 

తెలుగుదనాన్ని ఇంతగా ప్రోత్సహిస్తున్న శ్రీ రమేష్ రావెళ్ళ దంపతులకు మాగల్ఫ్.కామ్ వారి అభినందనలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com