తెలంగాణ బంద్.!
- October 19, 2019హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికులు 15 రోజులుగా చేస్తున్న సమ్మెకు మద్దతుగా ఈరోజు తెలంగాణలో రాష్ట్ర వ్యాప్త బంద్ జరుగుతోంది. ప్రతిపక్ష పార్టీలు, వామపక్షాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు బంద్లో పాల్గొంటున్నాయి. బంద్లో భాగంగా ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. బంద్ను విజయవంతం చేసి ప్రభుత్వం దిగొచ్చేలా చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి. మరోవైపు బంద్ ప్రభావం లేకుండా చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. టైర్లకు మేకులు కొట్టే యత్నం : హైదరాబాద్ నాగోల్ బండ్లగూడ డిపో వద్ద బస్సు డీజిల్ ట్యాంకర్ను ఆందోళనకారులు అడ్డుకోవడంతో ఉద్రికత పరిస్థితులు తలెత్తాయి. డీజిల్ ట్యాంకర్ టైర్లకు మేకులు కొట్టేందుకు ఆందోళనకారులు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఓ ప్రైవేటు డ్రైవర్ను కూడా ఆర్టీసీ కార్మికులు చితకబాదారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంజీబీఎస్ దగ్గరా కూడా పెద్ద ఎత్తున ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బస్సులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బస్సుపై రాళ్ల దాడి : నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం దాస్ నగర్ వద్ద ఆర్టీసీ బస్సుపై రాళ్లతో ఆందోళనకారులు దాడి చేయడంతో బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. నిజామాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న ఈ బస్సును బందోబస్తు మధ్య ఆర్మూర్ పోలీసులు దాటించారు. బంద్ నేపథ్యంలో ఆర్మూర్లో డిపోకే బస్సులు పరిమితయ్యాయి. ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో బంద్ ప్రశాంతంగా జరుగుతోంది. ప్రయాణికులు లేక బస్టాండ్లు నిర్మానుష్యంగా మారాయి.
పరకాలలో అరెస్ట్ల పర్వం : వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలో ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. బంద్కు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు పలకడంతో వ్యాపార వాణిజ్య విద్యా సంస్థలు బంద్లో స్వచ్ఛందంగా పాల్గొంటున్నాయి. పరకాల పట్టణం నిర్మానుష్యంగా మారింది. ప్రయాణికులు లేక పరకాల బస్టాండ్ వెలవెలబోతోంది. తాత్కాలిక డ్రైవర్లు కండక్టర్లు విధులకు హాజరు రాకపోవడంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. డిపో ప్రాంగణంలో భారీగా పోలీసులను మొహరించారు. పరకాల ఆర్టీసీ జేఏసీకి చెందిన 20 మంది కార్మికులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఉదయం 5 గంటల నుండే ఇండ్లలోకి పోయి కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కోదండరామ్, టీడీపీ నేతల అరెస్ట్ : ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా సికింద్రబాద్ జూబ్లీ బస్టాండ్ వద్ద బంద్లో పాల్గొనేందుకు వచ్చిన తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, పార్టీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని బొల్లారం పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆర్టీసీ కార్మికులతో వెంటనే ప్రభుత్వం చర్చలు జరపాలని ఈ సందర్భంగా కోదండరామ్ డిమాండ్ చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ, రావుల చంద్రశేఖర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులను పోలీసులు అరెస్ట్ చేశారు
పోలీసుల పర్యవేక్షణలో : ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. పోలీసుల పర్యవేక్షణలో డిపోల నుంచి ఆర్టీసీ బస్సులను అధికారులు బయటకు పంపుతున్నారు. ప్రతీ బస్సులో పోలీస్ సిబ్బంది ఉన్నారు. డిపో నుంచి బస్సులు బయటకు రాగానే ఆర్టీసీ కార్మిక నేతలు, కార్మికులు వాటిని అడ్డుకుంటున్నారు. పోలీసులు వెంటనే వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. జిల్లాలోని అన్ని డిపోలు, బస్టాండ్లు, వాటి పరిసరాల్లో భారీగా పోలీస్ బలగాలను మొహరించారు. ఆర్టీసీ బంద్కు వాణిజ్య, వర్తక సంఘాలు మద్దతు తెలిపాయి. తెలంగాణ బంద్ నేపథ్యంలో పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఆదిలాబాద్, నిర్మల్, భైంసా, ఉట్నూర్, మంచిర్యాల, ఆసిఫాబాద్ డిపోల వద్ద భారీగా పోలీస్ బలగాలన మొహరించారు.
బీజేపీ, వామపక్షాల నేతల అరెస్ట్
రాష్ట్ర బంద్ నేపథ్యంలో కామారెడ్డి జిల్లా బాన్సువాడలో 14 మంది బీజేపీ, సీపీఐ, ఆర్టీసీ నాయకులను తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేశారు. నిర్మల్ బస్ డిపో ముందు ఎస్పీ శశిధర్ రాజు పర్యవేక్షణలో పోలీసులు మొహరించారు. ఆసిఫాబాద్ బస్సు డిపో ముందు డీఎస్పీ సత్యనారాయణ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మతో ఎక్కడికక్కడే బస్సు లు నిలిచిపోయాయి.
భారీగా పోలీసుల మొహరింపు : నిజమాబాద్ జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. డిపోల ఎదుట భారీగా పోలీసులను మొహరించారు. అర్ధరాత్రి నుంచి కార్మిక సంఘాల నేతలు ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంద్ నేపథ్యంలో 6 డిపోల పరిధిలో 670 బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. రోడ్డు ఎక్కని బస్సులతో ప్రయాణికుల ఇబ్బందులు పడుతున్నారు. బోధన్ బస్టాండ్లో ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. బోధన్ బస్ డిపో ముందు ధర్నా చేస్తున్న వామపక్షాల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు