ఫిన్లాండ్ వేళ్లే భారతీయులకు శుభవార్త

- November 23, 2019 , by Maagulf
ఫిన్లాండ్ వేళ్లే భారతీయులకు శుభవార్త

న్యూఢిల్లీ: ఫిన్లాండ్ వేళ్లే భారతీయులకు ఆ దేశం తీపి కబురు అందించింది. భారత్‌తో ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను మరింత బలపరచుకునే దిశగా ఫిన్లాండ్ అడుగులేస్తుంది. దీనిలో భాగంగా వర్క్ వీసాలు మంజూరు చేయడానికి తీసుకుంటున్న సుమారు 52 రోజుల సమయాన్ని వచ్చే ఏడాది నుంచి 15 రోజులకు తగ్గించాలని యోచిస్తోంది. ఇక గత దశాబ్ద కాలంలో ఇండియా, ఫిన్లాండ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బాగా మెరుగు పడ్డాయి. ఈ పదేళ్ల కాలంలో ఇరు దేశాల మధ్య వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యం 2.5 బిలియన్ డాలర్లను దాటడమే దీనికి నిదర్శనం.

ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న ఆ దేశ ఎంప్లాయిమెంట్ మినిస్టర్ టిమో హరక్కా మీడియాతో మాట్లాడుతూ విదేశీయులకు ఇచ్చే వర్క్ వీసాను వచ్చే ఏడాది నుంచి 7-15 రోజుల్లోగా మంజూరు చేస్తామని ప్రకటించారు. ఇతర దేశాలకు చెందిన సాంకేతిక నిపుణులను ముఖ్యంగా భారతీయులను తమ దేశం వైపు ఆకర్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ నిపుణుల వీసాలకు సంబంధించి అభ్యర్థుల కనీస ఆర్జన పరిమితి, ఇతర విషయాల విషయంలోనే అధికంగా జాప్యం జరుగుతుంటుందని తెలిపారు. ఇకపై ఈ సమస్యలను కూడా 7 రోజుల నుంచి రెండు వారాల్లోగా పరిష్కరించి సత్వరమే వీసాలు అందిస్తామన్నారు.

ఇప్పటి వరకు మొదటిసారి నివాస అనుమతి లేదా వర్క్ వీసా ఇవ్వడానికి ఫిన్నిష్ ఇమ్మిగ్రేషన్ సర్వీస్(మిగ్రి) సగటు సమయం 52 రోజులు. ఈ పద్ధతిలో అక్టోబర్ 2018 నుంచి ఈ ఏడాది అక్టోబర్ వరకు మొత్తం 1,500 మంది ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ(ఐసీటీ) నిపుణులకు 'మిగ్రి' మొదటిసారి నివాస అనుమతి ఇచ్చిందని, వారిలో 50 శాతం మంది భారతీయులు ఉన్నారని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. హరక్కా గురువారం కేంద్ర రైల్వే, వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్, కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్‌తో పాటు పర్యాటక, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్‌తో సమావేశమయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com