తెలంగాణలో పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు

- April 17, 2020 , by Maagulf
తెలంగాణలో పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో లో శుక్రవారం ఒక్కరోజే 66 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 766కు చేరింది. ప్రస్తుతం 562 మంది బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

కరోనా నుంచి కోలుకుని 186 మంది బాధితులు డిశ్చార్జి అయ్యారు.కరోనాతో రాష్ట్రంలో ఇప్పటి వరకు 18 మంది మృతి చెందినట్లు ఆ ప్రకటనలో వివరించారు. వైరస్‌ తీవ్రత హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, నిజామాబాద్‌, సూర్యాపేట, వరంగల్‌ అర్బన్‌, గద్వాల జిల్లాల్లో ఎ‍క్కువగా ఉంది.

కాగా...ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 427 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా కరోనా కేసులు వెలుగుచేసిన ప్రాంతాల్లో అధికారులు పరిస్థితి సమీక్షించారు. వైరస్‌ ఇతరులకు సోకకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా వైరస్‌ వ్యాప్తి పెరుగుతుండటంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ , ఇతర మంత్రులు ప్పటికప్పడు అధికారులతో సమీక్ష చేపడుతున్నారు.

రాష్ట్రంలో ఏర్పాటు చేసిన కంటైన్‌మెంట్‌ జోన్లలో పకడ్బందీగా లాక్‌డౌన్‌ అమలు చేయాలని రాష్ట్ర ఐటీ, మున్సిపాలిటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అధికారులను ఆదేశించారు. జీహెచ్‌ఎంసీతో పాటు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల పరిధిలోని అడిషనల్‌ కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లు, ఏసీపీలతో మంత్రులు కేటీఆర్‌, ఈటల రాజేందర్‌, శ్రీనివాస్‌గౌడ్‌ లతో కలిసి ఆయన శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

కంటైన్‌మెంట్‌ జోన్లలో శానిటైజేషన్‌ను పెంచాలని, అక్కడ ఉండే ప్రజలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని ఆదేశించారు. వలస కార్మికుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 146 కంటైన్‌మెంట్‌ జోన్లు ఏర్పాటు చేసినట్లు కేటీఆర్‌ తెలిపారు.

గ్రేటర్‌లో కరోనా కేసులు తగ్గిన ప్రాంతాల్లో 15 కంటైన్‌మెంట్‌ జోన్లను తొలగించామని చెప్పారు. జ్వరం, గొంతు నొప్పికి మెడికల్‌ షాపుల్లో మందులు కొంటున్నారు. మెడికల్‌ షాపుల్లో మందులు కొనుగోలు చేసిన వారి వివరాలు సేకరించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

పల్లె, పట్టణ ప్రగతితో రాష్ట్రంలో పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయని ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ఈ చర్యలు దోహదపడుతాయన్నారు. అత్యవసర సేవలకు ప్రైవేటు అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచాలని అధికారులను ఈటల రాజేందర్‌ ఆదేశించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com