యువభారత్‌ అండర్‌-19 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు..

- February 09, 2016 , by Maagulf
యువభారత్‌ అండర్‌-19 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు..

 బంగ్లాదేశ్‌ వేదికగా జరుగుతున్న అండర్‌-19 ప్రపంచకప్‌లో యువభారత్‌ ఫైనల్‌కు చేరింది. ఢాకా వేదికగా జరిగిన సెమీఫైనల్లో ప్రత్యర్థి శ్రీలంకపై 97 పరుగుల తేడాతో భారత్‌ విజయం సాధించింది. ఈ టోర్నీలో తొలినుంచీ అదరగొడుతున్న యువభారత్‌ ప్రపంచకప్‌ అందుకునేందుకు ఇంకా ఒక్క అడుగు దూరంలోనే ఉంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 267 పరుగులు చేసింది. ఈ మెగా టోర్నీలో పరుగుల వరద పారిస్తున్న ఓపెనర్‌ రిషబ్‌ పంత్‌ ఈ మ్యాచ్‌లో 14 పరుగులకే వెనుదిరిగాడు.మరో ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ (7) సైతం నిరాశపరిచాడు. దీంతో 27 పరుగులకే భారత్‌ ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన అనుమోల్‌ప్రీత్‌ సింగ్‌(72: 92 బంతుల్లో 6×4, 1×6), సర్ఫరాజ్‌ ఖాన్‌ (59: 71 బంతుల్లో 6×4, 1×6) అర్థశతకాలతో జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 96 పరుగులు జత చేశారు. అనంతరం వాషింగ్టన్‌ సుందర్‌ (43), అర్మాన్‌ జాఫర్‌ (29) రాణించడంతో యువభారత్‌ 267 పరుగులు చేసింది.268 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకను భారత బౌలర్లు ఏ పరిస్థితుల్లోనూ తేరుకోకుండా కట్టడి చేశారు. 13 పరుగులకే ఓపెనర్లను పెవిలియన్‌కు పంపినా.. మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్లు షమ్ము ఆషన్‌ (38), విషాద్‌ రందిక (28), దమిత సిల్వా (24) కాస్త ప్రతిఘటించారు. అయితే వరుస విరామాల్లో భారత బౌలర్లు వికెట్లు తీయడంతో 42.4 ఓవర్లలో 170 పరుగులకే శ్రీలంక ఆలౌటైంది. దీంతో 97 పరుగుల తేడాతో భారత్‌ జట్టు విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com