ఎంఎంటీఎస్ ప్రయాణికులకు శుభవార్త
- February 09, 2016
పేపర్లెస్ టిక్కెట్ వ్యవస్థకు నేడు శ్రీకారం హైదరాబాద్: జంటనగరాల్లో ఎంఎంటీఎస్ ప్రయాణికులకు శుభవార్త. ఇప్పటి వరకూ ఎంఎంటీఎస్ రైలు ఎక్కడ ఉంది.. ఎన్ని గంటలకు వస్తుందనే సమాచారం 'హైలైట్స్' యాప్ ద్వారా అందించిన దక్షిణ మధ్య రైల్వే ఇప్పుడు స్మార్ట్ ఫోను ద్వారా టికెట్ తీసుకునే సౌకర్యాన్ని కల్పిస్తోంది.
ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా తయారు చేసిన యాప్ను బుధవారం అందుబాటులోకి తెస్తోంది. ఆదరాబాదరాగా రైల్వేస్టేషనుకు చేరుకోవడం.. టికెట్ కావాలంటే వంతెనపై నుంచి పట్టాలు దాటి వెళ్లడం.. బారులు తీరి టికెట్ తీసుకునే విధానానికి స్వస్తి చెబుతోంది. ఇక్కడో షరతు విధించింది. ఎంఎంటీఎస్ స్టేషన్కు 5 కిలోమీటర్ల పరిధిలోంచి టికెట్ తీసుకునే సౌకర్యం కల్పించింది. మీరు ఎక్కబోయే రైలుస్టేషన్కు 15 మీటర్ల దూరం నుంచి మాత్రమే టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎంచక్కా ప్లాట్ఫాం మీద కూర్చొని..రైలు ఎక్కిన తర్వాత తీసుకుందామంటే కుదరదు మరి.. ఇలా పెట్టడంలో రైల్వే అధికారులు రెండు జాగ్రత్తలు తీసుకున్నారు. స్టేషన్కు ముందుగానే ప్రయాణికులు చేరుకుని.. రైలు వచ్చాక నెమ్మదిగా రైలెక్కడం.. ఇది ప్రయాణికుల భద్రతకు సంబంధించిన అంశం. ఇక రెండోది అంటారా.. రైలులో కూర్చొని.. టికెట్ చెకింగ్ సిబ్బంది వచ్చినప్పుడు సెల్ఫోను ద్వారా టికెట్ తీసుకొని దొరక్కుండా తప్పించుకునే విధానానికి అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. బుధవారం అందుబాటులోకి తెచ్చిన ఈ యాప్ను సెల్ఫోనులో డౌన్లోడ్ చేసుకున్నాక మీరు http://www.utsonmobile.indianrail.gov.in అనే వెబ్సైట్లో మీ ఫోను నంబరుతో సహా వివరాలు నమోదు చేసుకోవాలి. రీఛార్జి చేసుకోవాలనుకున్నా..ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఇదే వెబ్సైట్లో ఆన్లైన్లో చేసుకునే అవకాశం కల్పించింది. ప్రీపెయిడ్ సెల్ ఫోను సర్వీసు మాదిరే సెల్ఫోనులో ఖాతాలో డబ్బులుండేట్టు రీఛార్జి చేసుకోవచ్చని దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఉమాశంకర్కుమార్ తెలిపారు. రూ.100 నుంచి రూ.5 వేలు వరకూ రీఛార్జి చేసుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. సబర్బన్ రైలు సర్వీసులుండే జంటనగరాలతో పాటు..చెన్నై, దిల్లీ, ముంబయ్, కోల్కతాల్లో రేపటి నుంచి అందుబాటులోకి తెస్తున్నట్టు చెప్పారు. వీడియో కాన్ఫరెన్సు ద్వారా రైల్వే మంత్రి సురేష్ ప్రభు దిల్లీ నుంచి ప్రారంభిస్తారన్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లోని ప్లాట్ఫాం నం.10లో నిర్వహించే కార్యక్రమంలో కేంద్రమంత్రి దత్తాత్రేయ బుధవారం మ.3.30కు ఈ సర్వీసులను ప్రారంభిస్తారన్నారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీతో పాటు మంత్రులు తలసాని, నాయిని పాల్గొంటారని తెలిపారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









