తెలంగాణ గౌరవ ప్రతీక బతుకమ్మ: గవర్నర్

- October 23, 2020 , by Maagulf
తెలంగాణ గౌరవ ప్రతీక బతుకమ్మ: గవర్నర్

హైదరాబాద్: రాజ్ భవన్ పరివార్ కు చెందిన మహిళలకు గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ బతుకమ్మ సంబురాలను పురస్కరించుకుని చీరలు పంపిణీ చేశారు. 

రాజ్ భవన్ దర్భార్ హాల్ లో ఈరోజు జరిగిన కార్యక్రమంలో మహిళా ఉద్యోగులకు, పరివార్ మహిళా సభ్యులకు గవర్నర్ స్వయంగా తెచ్చిన చీరలు పంపిణీ చేశారు. 
ఈ సందర్భంగా మాట్లాడుతూ బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలలో, జీవనంలో ఒక భాగమైన ప్రత్యేక పండుగ అని గవర్నర్ అన్నారు. 
తెలంగాణ ఆడ బిడ్డలు బతుకమ్మ పండుగతో ప్రకృతితో, దైవంతో, పుట్టిన గడ్డతో మమేకం అయ్యే ఒక విశిష్ఠమైన సందర్భం ఇదని డా. తమిళిసై వివరించారు. 
బతుకమ్మ సందర్భంగా ఆడబిడ్డలు ఇచ్చిపుచ్చుకునే నైవేద్యాలు ఆరోగ్యకరమైనవి, బలవర్ధకమైనవి. పండుగ సందర్భంగా వీటి పంపిణీ ద్వారా మహిళల్లో పోషకత, ఆరోగ్యం పెంపొందుతుందని ఒక డాక్టర్ గా తాను గమనించానని గవర్నర్ వివరించారు. 
ఈ పండుగ కోసం, బతుకమ్మను పేర్చడానికి వాడే పూలలో కూడా ఔషధ గుణాలుంటాయని, వాటి నిమజ్జనం ద్వారా చెరువుల్లోని నీరు శుద్ధి ఔతుందని డా. తమిళిసై తెలిపారు. 
తాను గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటి సారిగా రాజ్ భవన్ లో బతుకమ్మ సంబురాలు గత సంవత్సరం నుండి ప్రారంభించానని తెలంగాణ సోదరిగా, ఆడబిడ్డగా తనకు ఇది ఎంతో సంతృప్తిని ఇచ్చిందని ఆమె అన్నారు. 
వచ్చే సంవత్సరం కోవిడ్ – రహిత పరిస్థితుల్లో బతుకమ్మ జరుపుకుందామని గవర్నర్ ఆశాభావం వ్యక్తం చేశారు. 
ఈ సందర్భంగా కరోనాపై అవగాహన కలిగించేందుకు, రాజ్ భవన్ లో జరిగిన బతుకమ్మ వేడుకల నేపధ్యంలో రూపొందిన ఒక వీడియోను గవర్నర్ విడుదల చేశారు. 
ఈ కార్యక్రమంలో గవర్నర్ సెక్రటరి కె. సురేంద్ర మోహన్, జాయింట్ సెక్రటరీలు జె. భవానీ శంకర్, సి.ఎన్. రఘుప్రసాద్, ఇతర అధికారులు, మహిళలు, సిబ్బంది పాల్గొన్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com