విదేశాల్లో ప్రవాసీయులకు పోస్టల్ బ్యాలెట్-ఈసీ
- December 02, 2020
న్యూ ఢిల్లీ:భారత ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకోబోతుంది. విదేశాల్లో ఉండే భారతీయులకు ఓటే వేసే అవకాశాన్ని కల్పించాలని భావిస్తుంది. పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని వర్తింప జేయాలని ఈసీ యోచిస్తోంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం సైనిక బలగాలకు అందుబాటులో ఉన్న ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టంను విదేశాల్లోని అర్హులైన భారతీయ ఓటర్లకు కూడా కల్పించాలని ఈసీ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ మేరకు ఈసీ నవంబర్ 27వ తేదీన న్యాయశాఖకు లేఖ రాసినట్లు తెలుస్తోంది.
భారత సైన్యంలో విధులు నిర్వహిస్తున్నవారు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఈటీపీబీఎస్ సిస్టంను అమలు చేస్తోంది ఈసీ. ఇప్పటికే భద్రతా బలగాలకు ఈ విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తోంది. అయితే, విదేశాల్లో ఉన్న అర్హులైన భారతీయులు కూడా ఓటు వేసేలా ఈ పద్దతి ఉపయోగపడుతుందని నమ్మకం ఉందని ఈసీ చెబుతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్– జూన్ నెలల్లో అస్సాం, పశ్చిమబెంగాల్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సదుపాయాన్ని అమలు చేసేందుకు సాంకేతికంగా, పాలనాపరంగా తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ఇందుకోసం అనుమతి ఇవ్వాలంటూ కేంద్రానికి లేఖ రాసింది ఈసీ.
విదేశాల్లో ఉండే అర్హులైన భారతీయ ఓటర్లు ఓటు హక్కు వినియో గించుకునేందుకు స్వదేశానికి రావడం ఖర్చుతో కూడుకున్న వ్యవహరమని, బదులుగా పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించాలంటూ భారత ఎన్నికల సంఘానికి పలు విజ్ఞప్తులు అందాయి. అలాగే, కోవిడ్–19 ప్రోటోకాల్స్ నేపథ్యంలో ఈ సమస్య మరింత సంక్లిష్టమైందని న్యాయశాఖకు తెలిపింది. అందుకే ఈ రకమైన పద్దతిని అమలు చేయడం ద్వారా భారతీయులందరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం దక్కుతుందని ఈసీ తెలిపింది.
అయితే, ఈటీపీబీఎస్ విధానాన్ని ఉపయోగించుకునేవారికి ఈసీ పలు సూచనలు చేసింది. విదేశాల్లో ఉండే భారతీయులు ముందుగా తాము ఓటు హక్కు వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు రిటర్నింగ్ అధికారికి సమాచారం అందించాలి. అప్పుడే వారికి పోస్టల్ బ్యాలెట్ అందుతుంది. ఓటరు ఆ బ్యాలెట్ను డౌన్లోడ్ చేసుకుని ప్రత్యేక ఎన్వలప్లో తన ఓటు నమోదై ఉన్న నియోజకవర్గం రిటర్నింగ్ అధికారికి పంపించాల్సి ఉంటుంది. ఓట్ల లెక్కింపు రోజు ఉదయం 8 గంటలకు ఆ బ్యాలెట్ చేరుకుంటుంది. లెక్కింపు మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లతోనే మొదలవుతుంది. ఈటీపీబీఎస్ విధానంతో ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని నిపుణులు సైతం భావిస్తున్నారు. విదేశాల్లో ఉన్న తమ ఓటును కోల్పోకుండా ఉంటారని అంటున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి
- చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం..