ప్రైవేట్ కంపెనీల్లో జీతాల వివాదానికి పరిష్కారానికి కువైట్ అసెంబ్లీలో బిల్

- February 16, 2021 , by Maagulf
ప్రైవేట్ కంపెనీల్లో జీతాల వివాదానికి పరిష్కారానికి కువైట్ అసెంబ్లీలో బిల్

కోవిడ్ సంక్షోభంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కంపెనీ యాజమాన్యాలకు, వేతనాలు అందక ఇబ్బందులు పడే నిర్వాసిత ఉద్యోగులకు మధ్య వివాదాలకు తెరపడేలా కువైట్ అసెంబ్లీలో ముసాయిదా చట్టాన్ని ప్రవేశపెట్టారు. కువైట్ అసెంబ్లీ స్పీకర్ తో పాటు మరికొందరు చట్టసభ ప్రతినిధులు ముసాయిదా చట్టాన్ని ప్రవేశపెట్టినట్లు స్పీకర్ మార్జౌక్ అల్-ఘనేమ్ తెలిపారు. ప్రస్తుత కఠినమైన ఆర్ధిక పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగం కొల్పోయిన కార్మికులు, కంపెనీ యాజమాన్యాల మధ్య అవగాహన వచ్చేందుకు వీలుగా ప్రస్తుత ముసాయిదా చట్టం ఉందని స్పీకర్ వివరించారు. అయితే..గత సెషన్లో కూడా ఇదే తరహా ముసాయిదా చట్టం అసెంబ్లీ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సాధారణంగా కువైట్ చట్టాల ప్రకారం ముందస్తుగా చేసుకున్న ఒప్పందం మేరకు ఓ కార్మికుడి జీతాన్ని అతని అంగీకారం లేకుండా తగ్గించేందుకు వీలు లేదు. ఒకవేళ సదరు కార్మికుడ్ని విధుల్లో నుంచి తొలగిస్తే..ఒప్పందం మేరకు పూర్తిస్థాయి నష్టపరిహారని చెల్లించాల్సి ఉంటుంది. అయితే..కరోనా సంక్షోభంతో కువైట్ పారిశ్రామిక రంగం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా కంపెనీలు మూతపడే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. కొన్ని ఇప్పటికే మూతపడ్డాయి కూడా. ఈ నేపథ్యంలో కార్మికులను తొలిగించక తప్పని పరిస్థితి నెలకొంది. దీంతో కార్మికుల అనుమతి లేకుండా వారి జీతాలను సవరించే వెసులుబాటును కల్పిస్తూ గత అసెంబ్లీ సెషన్ లో బిల్లును ప్రతిపాదించారు. అయితే..కువైటీ కార్మికులకు ఈ చట్టం నుంచి మినహాయింపు ఇచ్చారు. కానీ, అప్పట్లో చట్టసభ్యులు బిల్లును వ్యతిరేకించారు. దీంతో కంపెనీలకు ఊరట కలిగించేలా అప్పటి ముసాయిదా చట్టంపై చట్టసభ్యులు, ఆర్ధిక వ్యవహారాల కమిటీ త్వరగా అధ్యయనం పూర్తి చేసి సభ ముందుకు తీసుకురావాలని, చర్చ తర్వాత బిల్లు పాస్ అయ్యేలా లోపాలను సవరించాలని స్పీకర్ అభిప్రాయపడ్డారు. ఇదిలాఉంటే ఆర్ధిక ఒడిదుడుకులతో మూతపడిన మధ్య, చిన్న తరహా కంపెనీలకు మినహాయింపులు ఇవ్వాలని కోరుతూ చట్టసభ్యుల బృందం మరో బిల్లును ప్రవేశపెట్టిందని స్పీకర్ వివరించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com