చదువుతోనే మహిళా సాధికారత సాధ్యం:టి.గవర్నర్

- March 20, 2021 , by Maagulf
చదువుతోనే మహిళా సాధికారత సాధ్యం:టి.గవర్నర్

హైదరాబాద్:మహిళలు చదువు ద్వారా, ఉద్యోగాల ద్వారా స్వయం ఉపాధి ద్వారా అలాగే  ఎంటర్ ప్రెన్యూర్షిప్ ద్వారా సాధికారత సాధించగలరని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు.ఎన్నో అడ్డంకులు, అవరోధాలు ఎదురైనప్పటికీ గొప్ప స్వయం శక్తి ద్వారా, ఆత్మవిశ్వాసం ద్వారా వారు సాధికారత సాధించగలరు అని ఆమె తెలిపారు.శనివారం  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు నిర్వహించిన పవర్ టాక్ అనే  కార్యక్రమంలో గవర్నర్ పాల్గొని ప్రసంగించారు.

ఈ రోజుల్లో మహిళలు యుద్ధ విమానాలు నడుపుతున్నారు, సరిహద్దులలో కమాండోలుగా రక్షణగా ఉంటున్నారు, అంతరిక్షంలోనూ  మహిళా వ్యోమగాములు తమ సత్తా చాటుతున్నారు అని డాక్టర్ తమిళిసై ప్రశంసించారు. సమస్యలకు భయపడి తమ కలలను సాకారం చేసుకోవడంలో వెనుకంజ వేయకూడదని,  మహిళలు గొప్ప సంకల్పబలంతో ముందుకు సాగాలని గవర్నర్ పిలుపునిచ్చారు. గతంలో మహిళా మంత్రులకు  కుటుంబ సంక్షేమ శాఖ లాంటివి మాత్రమే ఇచ్చేవారని, ప్రధానమంత్రి నరేంద్రమోడీ మహిళా మంత్రులకు విదేశీ వ్యవహారాలు, రక్షణ, ఆర్థిక శాఖలు కూడా తన మంత్రివర్గంలో వివిధ సందర్భాలలో  కల్పించారని ఆమె కొనియాడారు.


గతంలో మహిళా మెడికోలు కేవలం గైనకాలజీ  లాంటి శాఖలకే  పరిమితం అనుకునేవారు, అయితే ఇప్పుడు మహిళా మెడికోలు సర్జన్లుగా,  కార్డియాలజిస్టులుగా, నెఫ్రాలజిస్టులుగా రాణిస్తున్నారని డాక్టర్ తమిళి సై వివరించారు.చదువు, ఆత్మవిశ్వాసం, సంకల్పబలం, తమకు ఇష్టమైన రంగాలలో రాణించాలన్న తపన అత్యంత కీలకమని గవర్నర్ తెలిపారు.అన్ని రంగాలలో మహిళల సమానత్వం కోసం అందరూ కృషి చేయాలని,  అలాగే వారిని ప్రోత్సహించాలని గవర్నర్ పిలుపునిచ్చారు.అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా వర్ఛువల్ పధ్ధతిలో ఈ పవర్ టాక్ నిర్వహించారు.బ్యాంకుకు చెందిన వివిధ స్థాయిలలో ఉన్న అనేకమంది మహిళా ఆఫీసర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com