ఏపీలో కొత్తగా 60కోవిడ్ కేంద్రాలు:ఆళ్ల నాని

- April 28, 2021 , by Maagulf
ఏపీలో కొత్తగా 60కోవిడ్ కేంద్రాలు:ఆళ్ల నాని

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యలపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం భేటీ ముగిసింది. మంత్రి ఆళ్ల నాని నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి మంత్రులు, అధికారులు హాజరై రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులపై విస్తృతంగా చర్చించారు. కరోనా రోగులకు అందుతున్న వైద్యం, ఆక్సిజన్‌ సరఫరా, రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్ల కొరత, ఆస్పత్రుల్లో పడకల పెంపు, హెల్ప్‌డెస్క్‌పై ప్రధానంగా చర్చించారు. సమావేశం అనంతరం మంత్రి ఆళ్లనాని మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కొత్తగా 60 కొవిడ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మరో 30 వేల కొవిడ్‌ పడకలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఆక్సిజన్‌ కొరత రాకుండా ముందస్తుగా అన్ని చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.
‘‘కరోనా బాధితులు పూర్తిగా కోలుకునే వరకు బాధ్యత తీసుకుంటాం. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందించేందుకైనా సిద్ధంగా ఉన్నాం. ఆస్పత్రుల్లో పడకల కోసం రోజురోజుకూ డిమాండ్‌ పెరుగుతోంది. కొవిడ్‌ బాధితులకు 37వేల పడకలు పెంచాం. మరో 33వేల కొవిడ్‌ కేంద్రాల్లో పడకలు ఏర్పాటు చేస్తున్నాం. కేంద్రాల్లో ఎక్కడా ఆక్సిజన్‌ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. కేంద్రం కేటాయించిన 482 టన్నుల ఆక్సిజన్‌ను వాడుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో రెమ్‌డెసివిర్‌ కొరత రాకుండా చేస్తున్నాం. రెమ్‌డెసివిర్‌ సరఫరా, వినియోగంలో అక్రమాలు జరగకుండా చూసేందుకు కమిటీని వేశాం’’ అని మంత్రి వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com