నా 16 ఏళ్ల ఎడారి కష్టార్జితం ఇప్పించండని దరఖాస్తు చేసిన గల్ఫ్ కార్మికుడు

- May 01, 2021 , by Maagulf
నా 16 ఏళ్ల ఎడారి కష్టార్జితం ఇప్పించండని దరఖాస్తు చేసిన గల్ఫ్ కార్మికుడు

తెలంగాణ: యూఏఈ రాజధాని అబుధాబిలోని తన యాజమాన్య కంపెనీ ఘంతూత్ ట్రాన్సుపోర్టు అండ్ జనరల్ కాంట్రాక్టింగ్ నుండి తనకు రావలసిన 16 సంవత్సరాల కష్టార్జితం 'ఎండ్ ఆఫ్ సర్వీస్ బెనిఫిట్స్' (ఉద్యోగ ముగింపు ప్రయోజనాలు) ఇప్పించాలని పెట్టెం కిషన్ అనే గల్ఫ్ కార్మికుడు శుక్రవారం మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. 

మంచిర్యాల జిల్లా లక్షెటిపేట మండలం కొత్తూరు గ్రామానికి చెందిన పెట్టెం కిషన్ అనే  కార్మికుడు 2004 లో అబుదాబి కి వెళ్లి ఒకటే కంపెనీలో 2020 వరకు సాధారణ కార్మికుడిగా, ఎలక్ట్రీషియన్ గా 16 సంవత్సరాలు సేవలు అందించాడు. గత సంవత్సరం అక్టోబర్ లో సెలవుపై ఇండియాకు వచ్చాడు మార్చిలో లాక్ డౌన్ ప్రకటించడం, విమానాల నిలిపివేత వలన  వలన మళ్ళీ అబుదాబీకి  వెళ్లలేకపోయాడు. ఇదే అదనుగా కంపెనీ యాజమాన్యం ఆన్ లైన్ లో వీసాను రద్దు చేసింది.  

తన 16 సంవత్సరాలపాటు పనిచేసిన పిఎఫ్, గ్రాట్యుటీ, బోనస్ లాంటి ఉద్యోగ విరమణ ప్రయోజనాలు ఇవ్వాల్సిందిగా కంపెనీ యాజమాన్య ప్రతినిధులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని పెట్టెం కిషన్ వాపోయాడు.గల్ఫ్ కార్మికుల హక్కుల కోసం పోరాడుతున్న ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ ను సంప్రదించి వారి సలహా మేరకు జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించానని ఆయన అన్నారు. 

ఈ సందర్బంగా ప్రవాసి యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్వదేశ్ పరికిపండ్ల మాట్లాడుతూ 'జస్టిస్ ఫర్ వేజ్ తెఫ్ట్' (జీతం దొంగతనం గురించి న్యాయం చేయాలి) అనే అంతర్జాతీయ అవగాహన ప్రచార ఉద్యమాన్ని చేపట్టామని అన్నారు. కరోనా కష్టకాలంలో... గల్ఫ్ దేశాల నుండి ఇండియాకు హడావిడిగా వెళ్లగొట్టబడిన వారికి జీతం బకాయిలు ఇప్పించడానికి తాము అండగా ఉంటామని న్యాయ పోరాటం చేస్తామని అన్నారు.జీతం బకాయిలు రావలసిన వారు యూనియన్ హెల్ప్లైన్ నెంబర్ +91 62817 63686 కు కాల్ చేయాలని ఆయన తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com