సొంతూరికి రైలెక్కిన రాష్ట్రపతి దంపతులు

- June 25, 2021 , by Maagulf
సొంతూరికి రైలెక్కిన రాష్ట్రపతి దంపతులు

న్యూఢిల్లీ : భారత రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ తన భార్య సవితాదేవితో కలిసి యూపీ కాన్పూర్‌లోని స్వస్థలానికి రైలులో బయలుదేరారు. ఢిల్లీ సప్ధర్‌జంగ్‌ రైల్వేస్టేషన్‌లో ప్రత్యేక రైలు ఎక్కగా.. కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌, రైల్వేబోర్డు చైర్మన్‌, సీఈఓ సునీశ్‌ శర్మ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఆయనకు జ్ఞాపికను అందజేశారు. రాంనాథ్‌ కోవింద్‌ రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన మొదటిసారిగా స్వగ్రామానికి రైలులో వెళ్తున్నారు. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఢిల్లీ నుంచి రైలులో బయలుదేరగా.. సాయంత్రానికి కాన్పూర్‌ చేరుకుంటుంది.

కాన్పూర్ దేహాట్ మార్గంలోని జిన్జాక్, రురాల వద్ద ఈ ప్రత్యేక రైలు కొద్దిసేపు ఆగనుంది. పర్యటనలో రాష్ట్రపతి పాత పరిచయస్తులను, పాఠశాల స్నేహితులను కలువనున్నారు. గ్రామాన్ని సందర్శించిన తర్వాత తిరిగి ఈ నెల 28న కాన్పూర్‌ సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌ నుంచి రైలులో లక్నోకు చేరుకుంటారు. అక్కడ పర్యటన అనంతరం తిరిగి 29న ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరిగి రానున్నారు. 15 సంవత్సరాల తర్వాత రాష్ట్రపతి రైలు ప్రయాణించడం ఇదే తొలిసారి. ఇంతకు ముందు 2006లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం ఢిల్లీ నుంచి డెహ్రాడూన్‌కు రైలులో ప్రయాణించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com