భారత్ కు మరిన్ని రాఫెల్ జెట్స్..ఫ్రాన్స్ రక్షణ మంత్రి

- December 17, 2021 , by Maagulf
భారత్ కు మరిన్ని రాఫెల్ జెట్స్..ఫ్రాన్స్ రక్షణ మంత్రి

భారత్ కోరితే మరిన్ని రాఫేల్ యుద్ధ విమానాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లే తెలిపారు.

భారత పర్యటనలో ఉన్న ఫ్రాన్స్ రక్షణ మంత్రి..భారతదేశపు ఉన్నతస్థాయి పబ్లిక్ పాలసీ బాడీ అనంత ఆస్పేన్ సెంటర్ శుక్రవారం నిర్వహించిన పబ్లిక్ సెషన్ లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా…మరిన్ని రాఫెల్ విమానాలు కావాలని భారత్ అడిగితే, ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రాఫెల్ యుద్ధ విమానాలు రెండు దేశాలకు నిజమైన సంపదగా, శక్తిగా ఉంటాయన్నారు. రఫేల్ పట్ల ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంతృప్తి వ్యక్తం చేయడం హర్షణీయమని పార్లే పేర్కొన్నారు. భారత వాయుసేన అవసరాలు తీర్చేందుకు తాము ఆసక్తి చూపుతున్నామని ఆమె స్పష్టం చేశారు. కోవిడ్ వేళ కూడా విమానాలను అందించడం గొప్ప అచీవ్‌మెంట్ అన్నారు.

కాగా, 36 రాఫేల్ యుద్ధ విమానాల కోసం 2016లో ఫ్రాన్స్‌తో ఇండియా ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. సుమారు 59వేల కోట్లకు ఆ ఒప్పందం కుదిరింది. ఇప్పటివరకు పలు దఫాలుగా 33 విమానాలు సరఫరా చేశారు. మిగిలిన 3 విమానాలు ఫ్రాన్స్ వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి అందజేయనుంది. ఈ నేపథ్యంలో భారత్ తో రాఫెల్ విమానాల ఒప్పందం పొడిగింపునకు ఫ్రాన్స్ దేశం ఆసక్తిగా ఉన్నట్టు ఆ దేశ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లే వ్యాఖ్యలతో స్పష్టమవుతోంది. పార్లీ తన పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ లతో భేటీ అయ్యారు. ఇరుదేశాల రక్షణమంత్రులు పలు ద్వైపాక్షిక అంశాలపై కీలక చర్చలు జరిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com