సింగపూర్ లో డా.రామ్ మాధవ్ పుస్తక పరిచయం & విశ్లేషణ సభ విజయవంతం..

- May 13, 2022 , by Maagulf
సింగపూర్ లో డా.రామ్ మాధవ్ పుస్తక పరిచయం & విశ్లేషణ సభ విజయవంతం..

సింగపూర్: డా.రామ్ మాధవ్ ఇటీవల రచించిన "ది హిందుత్వ పారడైమ్" (సమగ్ర మానవతావాదం మరియు పాశ్చాత్యేతర ప్రపంచ దృష్టికోణం కోసం అన్వేషణ) పుస్తక పరిచయం & విశ్లేషణ కార్యక్రమము సింగపూర్ లో మే 8న జరిగిన ఘనంగా నిర్వహించబడింది, "శ్రీ సాంస్కృతిక కళాసారథి", సింగపూర్  ఆధ్వర్యంలో, కోవిడ్ ఆంక్షలు ఎత్తివేసిన తరువాత జరిగిన ఈ మొట్టమొదటి కార్యక్రమములో 10కి పైగా స్థానిక భారతీయ సంస్థలు అధిపతులతో పాటు సుమారుగా ౩౦౦ మందికి పైగా సింగపూర్ వాసులు పాల్గొన్నారు.

 పుస్తక రచయిత , బీజేపీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఇండియా ఫౌడేషన్ పాలక మండలి సభ్యుడు డా రామ్ మాధవ్ మాట్లాడుతూ ... "మీ అందరికీ తెలుసు హిందూ, హిందుత్వం అనేది ఇప్పుడు భారతదేశంలో చాలా సాధారణ విషయం, ప్రధాన స్రవంతి వంటిది. హిందూ మతం గురించి మాట్లాడే వారు ఈ రోజుల్లో ఒక నిర్దిష్ట రాజకీయ పార్టీకి లేదా నిర్దిష్ట సంస్థకు చెందిన వారు మాత్రమే కాదు, దీనిని వ్యతిరేకించే వారు కూడా లౌకికవాదం మొదలైన ఆలోచనలను ప్రకటించేవారు ఉన్నారు... ముఖ్యంగా భారత రాజకీయాలను అనుసరించే వారు చాలా ప్రముఖంగా గమనించి ఉంటారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. భారతదేశంలో తమ హిందూ గుర్తింపును చాలా బలంగా ప్రకటిస్తున్నారు. నేటి భారత రాజకీయ నాయకులు మునుపటి కంటే మరింత స్పష్టంగా బహిరంగంగా తమ హిందుత్వాన్ని చాటుకుంటున్నారు, బహిరంగ సభలలో ఎవరికి తెలిసిన మంత్రాలు వారు జపిస్తున్నారు. కారణం హిందూ, హిందూమతం, హిందూత్వమే ఈనాడు భారతదేశం ప్రధాన స్రవంతి, ఇది భారతదేశ జాతీయ జీవితానికి కేంద్ర వేదిక కాబట్టి అందరూ దీనికి కారణం రాజకీయాలతో సంబంధం లేకుండా హిందువులమని చెప్పుకోవాలని అనుకుంటున్నారు.మీలో చాలామందికి తెలుసు 1995లో ఎన్నికల పిటిషన్‌పై భారత అత్యున్నత న్యాయస్థానం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది 'హిందుత్వం మతం కాదని వారు తీర్పు చెప్పారు'.  హిందుత్వం అంటే ఒక జీవన విధానం, మనందరికీ తెలిసిన మార్గం" అని చెప్పారు. ప్రతి హిందువు ఇతరులను ద్వేషించకుండా వారిని మంచిగా మార్చే సామర్థ్యాన్ని పెంచుకోవాలి, హిందుత్వంలో ద్వేషానికి చోటులేదన్నారు.
నేను వ్రాసిన హిందుత్వం పుస్తకం ఈ విషయాలను 21వ శతాబ్దపు వాస్తవికతకు అన్వయించవచ్చా లేదా అనే దాని గురించి మాట్లాడుతుంది, ఈ ఆలోచన ప్రపంచ దృక్పథం ఆధారంగా మన రాజకీయ వ్యవస్థలను అభివృద్ధి చేయగలమా లేదా అనేది తెలియచేస్తుంది" అని ప్రసంగించారు.

 అనంతరం సభ్యులు అడిగిన ప్రశ్నలకు సావధానంగా సమాధానాలు చెప్పి సందేహ నివృత్తి చేసారు. 'శ్రీ సాంస్కృతిక కళాసారథి' సంస్థని స్థాపించాక మొట్టమొదటి స్థానిక సామూహిక కార్యక్రమము విజయవంతం అవ్వడంపట్ల నిర్వాహుకులు కవుటూరు రత్నకుమార్ తదితరులు సంతోషం తెలియచేశారు. ఈ కార్యక్రమము విజయవంతం కావడం కోసం అహర్నిశలు కృషిచేసిన  ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు రవితేజ్ భాగవతుల, రామాంజనేయులు చామిరాజు, శ్రీధర్ భరద్వాజ్, సురేష్ చివుకుల, యోగేష్ హిందూజ, సంజయ్, ఊలపల్లి భాస్కర్,రాధిక మంగిపూడి, రాధాకృష్ణ గణేశ్న, కాత్యాయని గణేశ్న, గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ నుండి ప్రభురామ్, మమత, దినేష్, ఇండియా ఫౌండేషన్ నుండి దీక్ష తదితరులకు 'శ్రీ సాంస్కృతిక కళాసారథి' వ్యవస్థాపక అధ్యక్షులు రత్న కుమార్ కవుటూరు ధన్యవాదాలు తెలియచేసారు.

 కార్యక్రమ నిర్వహణకు ఆడిటోరియంని మరియు భోజన సదుపాయాలను గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ అధ్యక్షుడు అతుల్ ప్రత్యేకంగా అందజేశారు. కార్యక్రమము చివరలో  "ది హిందుత్వ నమూనా" పుస్తకం మీద రామ్ మాధవ్ తో హాజరైన సభ్యులు అందరూ ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com