అమలాపురంలో హైటెన్షన్..

- May 24, 2022 , by Maagulf
అమలాపురంలో హైటెన్షన్..

అమరావతి: అమలాపురంలో హైటెన్షన్ నెలకొంది. అమలాపురం పట్టణం రణరంగాన్ని తలపిస్తోంది. ఆందోళనకారులు వర్సెస్ పోలీసులు అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ప్రస్తుత కోనసీమ జిల్లా పేరునే కొనసాగించాలని కోరుతూ మంగళవారం జిల్లా కేంద్రమైన అమలాపురంలో భారీ ఎత్తున ర్యాలీ చేసేందుకు ఆందోళనకారులు సిద్ధమయ్యారు.

అయితే ఎటువంటి సమావేశాలు, ర్యాలీలు చేయకూడదని 144 సెక్షన్ అమల్లో ఉందని పోలీసులు తేల్చి చెప్పారు. అయినా ఆందోళనకారులు లెక్క చేయలేదు. పెద్దఎత్తున అమలాపురం చేరుకున్నారు. ముఖ్యంగా యువకులు పెద్ద మొత్తంలో వ్యూహాత్మకంగా అడుగు పెట్టారు. రంగంలోకి దిగిన పోలీసులు వీరిని చెల్లాచెదురు చేస్తున్నారు.

పరిస్థితి చేయి దాటి పోవడంతో స్వయంగా కోనసీమ జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి రంగంలోకి దిగారు. లాఠీ చేతబట్టారు. ఆందోళనకారులను చెదరగొట్టారు. అమలాపురంలో ఎక్కడికక్కడ యువకులను అడ్డుకుంటున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకుంటున్నారు.

మరోవైపు కోనసీమ జిల్లా పేరును కొనసాగించాలని కోరుతూ వినతి పత్రాలతో ర్యాలీగా అమలాపురం కలెక్టర్ కార్యాలయానికి వెళ్తున్న యువకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అమలాపురం పట్టణం రణరంగంగా మారింది. ఎక్కడ చూసినా పోలీసులను మోహరించారు. దీంతో అమలాపురం పట్టణం కాకీమయంగా మారింది. దొరికిన వాళ్లను దొరికినట్లుగా పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.

కోనసీమ జిల్లాకు మద్దతుగా అమలాపురం బస్ స్టాండ్ నుండి ర్యాలీ నిర్వహిస్తున్నారు యువకులు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు. ఈ ఘటనలో ఓ గన్ మెన్ కు గాయాలయ్యాయి. రాళ్లు రువ్వడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఆందోళనకారులను చెదరగొడుతున్నారు. మరోవైపు దుండగులు ఎస్పీ వాహనంపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com