‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు..

- March 18, 2026 , by Maagulf
‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు..

అమరావతి: ఏపీలోని కూటమి ప్రభుత్వం కొత్త పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో కలిసి బుధవారం మంగళగిరి బస్టాండ్‌లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి లోకేశ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంగళగిరి బస్టాండ్ నుండి ఉండవల్లి వరకూ దివ్యాంగులతో కలిసి నేతలు పల్లె వెలుగు బస్సులో ప్రయాణించారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం వచ్చాక దివ్యాంగులకు అందుతున్న సంక్షేమ పథకాలు, వారి బాగోగుల గురించి సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. ఇదిలాఉంటే ఈ పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో 11.16లక్షల మంది దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం ఉచిత ప్రయాణం కల్పించింది. ఈ పథకాన్ని ఉగాది కానుకగా కూటమి ప్రభుత్వం ప్రారంభించింది.

దివ్యాంగ శక్తి పథకంకు 40శాతం అంతకంటే ఎక్కువ వైకల్యం ఉండేవారు అర్హులు. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో వారు ఉచితంగా ప్రయాణించొచ్చు. ఆల్ట్రా డీలక్స్, అంతర్ రాష్ట్ర సర్వీసులు తదితర వాటిల్లో 50శాతం రాయితీపై ప్రయాణ సౌకర్యం ఉంటుంది. వందశాతం మానసిక రోగులు, అంధత్వం ఉన్నవారితోపాటు ఎస్కార్ట్ గా వచ్చే వారు కూడా ఉచితంగా బస్సులో ప్రయాణించొచ్చు. అంధులతో పాటు ఆర్థో, మూగ, చెటివి, లెప్రసీ, మానసిక వ్యాధిగ్రస్థులు, దీర్ఘకాలిక రోగులు, తలసీమియా బాధితులు ఇలా 21 కేటగిరీల్లో ఉన్నవారికి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అవకాశం ఉంటుంది.

ఉచిత బస్సు ప్రయాణం పాస్‌లు పొందాలంటే ఆర్టీసీ కాంప్లెక్స్ కు వెళ్లి సంప్రదించాలి. సదరం ధ్రువీకరణ తప్పనిసరి. అందులో 40శాతం, అంతకుమించి ఉండాలి. దాంతోపాటు ఇతరత్రా ధ్రువపత్రాలు అందిస్తే పాస్ మంజూరు చేస్తారు. ఆన్‌లైన్ ద్వారానూ పొందొచ్చు. బస్సులను సులువుగా ఎక్కేందుకు స్టాండ్ లలో ప్రత్యేక సౌకర్యాలను కల్పిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com