కువైట్ లోని సూప‌ర్ మార్కెట్ నుంచి భార‌తీయ ఉత్ప‌త్తుల‌ తొలగింపు

- June 06, 2022 , by Maagulf
కువైట్ లోని సూప‌ర్ మార్కెట్ నుంచి భార‌తీయ ఉత్ప‌త్తుల‌ తొలగింపు

కువైట్ సిటీ:  మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై బీజేపీ నాయ‌కురాలు నురూప్ శ‌ర్మతో పాటు ఆ పార్టీ నేత‌ న‌వీన్ కుమార్‌ జిందాల్‌ అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డంతో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే కువైట్ త‌మ దేశంలోని భార‌త దౌత్యాధికారుల‌కు స‌మ‌న్లు జారీ చేసి, పిలిపించుకుని నిర‌స‌న వ్య‌క్తం చేసింది. తాజాగా కువైత్ న‌గ‌రంలోని ఓ సూప‌ర్ మార్కెట్‌లోని షెల్ఫ్స్ నుంచి అల్‌-అర్దియా కోఆప‌రేటివ్ సొసైటీకి చెందిన వారు భార‌తీయ టీ, ఇత‌ర ఉత్ప‌త్తుల తీసేసి ట్రాలీలో వేసి తీసుకెళ్లి వాటిని అమ్మ‌కానికి ఉంచ‌కుండా చేశారు. అలాగే, బియ్యం, మిర్చి వంటి బ‌స్తాల‌ను క‌వ‌ర్‌తో ఆ సూపర్ మార్కెట్ సిబ్బంది క‌ప్పేశారు.

ఆ క‌వ‌ర్‌పై భార‌తీయ ఉత్ప‌త్తుల‌ను మేము తొల‌గించాము అని అర‌బిక్‌లో రాశారు. ”ప్ర‌వ‌క్త‌పై అనుచిత వ్యాఖ్య‌ల‌ను చేయ‌డాన్ని కువైట్ ముస్లింలు ఉపేక్షించ‌రు” అని ఆ సూప‌ర్ మార్కెట్ సీఈవో న‌జీర్ అల్ ముతైరీ మీడియాకు చెప్పారు. ఇప్ప‌టికే ఖ‌తార్‌, కువైట్ త‌మ దేశాల్లోని భార‌త రాయ‌బారుల‌కు స‌మ‌న్లు జారీ చేయ‌గా ఇప్పుడు ఆ జాబితాలో ఇరాన్ కూడా చేరింది. భార‌త రాయ‌బారిని పిలిపించుకుని, నిర‌స‌న వ్య‌క్తం చేసింది. బీజేపీ నేత‌లు చేసిన వ్యాఖ్య‌ల‌పై ముస్లిం దేశాలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. మ‌రోవైపు, భార‌త్ క్ష‌మాప‌ణ‌లు చెప్పాలంటూ ఖ‌తార్ డిమాండ్ చేస్తోంది.

అలాగే, ఈజిప్టులోని అల్‌-అజ‌ర్ యూనివ‌ర్సిటీ కూడా ఓ ప్ర‌క‌ట‌న చేస్తూ ”ప్రవక్త పై ఇటువంటి వ్యాఖ్య‌లు చేయ‌డమే నిజ‌మైన ఉగ్ర‌వాదం.మొత్తం ప్ర‌పంచాన్ని సంక్షోభంలో ప‌డేస్తుంది. యుద్ధాల‌కు దారి తీస్తుంది” అని పేర్కొంది.సౌదీ అరేబియా కేంద్రంగా న‌డిచే ముస్లిం వ‌ర‌ల్డ్ లీగ్ కూడా మండిప‌డింది.”ఇదో హేయ‌మైన చ‌ర్య‌.. విద్వేషాన్ని రెచ్చ‌గొడుతున్నారు” అంటూ పేర్కొంది.గ‌తంలో ఫ్రెంచ్ అధ్య‌క్షుడు ఇమ్మాన్యుయ‌ల్ మ్యాక్రాన్ కూడా ప్ర‌వ‌క్త‌పై ప‌లు అనుచిత‌ వ్యాఖ్య‌లు చేయ‌డంతో ముస్లిం దేశాలు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే. గ‌ల్ఫ్ దేశాల్లో భార‌తీయుల సంఖ్య అధికంగానే ఉంటుంది. కాగా, మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై నురూప్ శ‌ర్మ, న‌వీన్ కుమార్‌ జిందాల్‌ అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డంతో ఇప్ప‌టికే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (OIC) కూడా భారత్‌ పై విమ‌ర్శ‌లు చేసింది.దీని పై స్పందించిన భార‌త ప్రభుత్వం ఇప్ప‌టికే ఘాటుగా స‌మాధానం ఇచ్చింది.నురూప్ శ‌ర్మపై చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని, ఈ వివాదం విష‌యంలో త‌ప్పుడు ప్ర‌చారం చేయొద్ద‌ని చెప్పింది.

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com