భారత్ మానవరహిత తొలి యుద్ధ విమానం.. పరీక్షించిన DRDO

- July 01, 2022 , by Maagulf
భారత్ మానవరహిత తొలి యుద్ధ విమానం.. పరీక్షించిన DRDO

బెంగుళూరు: దేశీయంగా మానవరహిత తొలి యుద్ధ విమానాన్ని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ విజయవంతంగా పరీక్షించింది. కర్ణాటకలోని చిత్రదుర్గలో ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ నుంచి తొలి మానవరహిత విమానాన్ని DRDO పరీక్షించింది. అంటే.. మానవ రహిత యుద్ధ విమానాలను అభివృద్ధి చేయడంలో ఇదో పెద్ద విజయంగా డీఆర్డీవో పేర్కొంది.

అటానమస్ ఫ్లయింగ్ వింగ్ టెక్నాలజీ డెమాన్‌స్ట్రేటర్ తొలి మానవరహిత విమానాన్ని విజయవంతంగా పరీక్షించినట్లు ట్విట్టర్‌ వేదికగా DRDO పేర్కొంది. ఈ మానవరహిత యుద్ధ విమానానికి సంబంధించిన వివరాలను డీఆర్డీవో వెల్లడిచింది. ఈ విమానం పూర్తిగా స్వయంప్రతిపత్తి మోడ్‌లో పనిచేస్తుందని తెలిపింది.

టేకాఫ్, వేపాయింట్ నావిగేషన్, స్మూత్ టచ్‌డౌన్‌తో సహా కచ్చితమైన ప్రమాణాలను విమానం చేరుకున్నట్లు పేర్కొంది. భవిష్యత్తులో మానవ రహిత విమానాల అభివృద్ధికి అవసరమైన టెక్నాలజీని అభివృద్ధి చేయడంలో ఈ తొలి యుద్ధ విమానం ప్రధాన మైలురాయిగా నిలుస్తుందని తెలిపింది.

అంతేకాదు.. వ్యూహాత్మక రక్షణ సాంకేతికతలో స్వావలంబన దిశగా ఇది ముఖ్యమైన అడుగుగా పేర్కొంది. మానవరహిత యుద్ధ విమానం (UAV) DRDO ప్రధాన పరిశోధనా ప్రయోగశాల అయిన బెంగళూరులోని ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ ఆధ్వర్యంలో రూపొందించారు.

ఇది ఒక చిన్న టర్బోఫ్యాన్ ఇంజన్‌తో రన్ అవుతుంది. మానవరహిత విమానాన్ని పరీక్షించేందుకు ఉపయోగించిన ఎయిర్‌ఫ్రేమ్, అండర్ క్యారేజ్, ఫ్లైట్ కంట్రోల్, ఏవియానిక్స్ వ్యవస్థలను దేశీయంగా అభివృద్ధి చేశారు. డిఆర్‌డిఓ ప్రకటనపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందనలు తెలిపారు. ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా వ్యూహాత్మక సైనిక వ్యవస్థల అభివృద్ధికి దోహదపడుతుందని రాజ్ నాథ్ సింగ్ ప్రశంసించారు.

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com