ఆస్పత్రిలో వెంటిలేటర్ పనిచేయక నలుగురు నవజాత శిశువులు మృతి

- December 05, 2022 , by Maagulf
ఆస్పత్రిలో వెంటిలేటర్ పనిచేయక నలుగురు నవజాత శిశువులు మృతి

 ఛతీస్‌గఢ్‌: ఛతీస్‌గఢ్‌ రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. వెంటిలేటర్ పనిచేయక పోవటంతో నలుగురు నవజాత శిశువులు మరణించారు. అంబికాపూర్ మెడికల్ కాలేజీలో ఆదివారం అర్థరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. రాత్రి ఆస్పత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో వెంటిలేటర్ ఆగి నలుగురు చిన్నారులు చనిపోయారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై మృతుల కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యమే శిశువుల మృతికి కారణమని చిన్నారుల కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ ఘటన విషయాన్ని తెలుసుకున్న సుర్గుజా జిల్లా కలెక్టర్ కుందన్ కుమార్ వెంటనే ఆస్పత్రికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. తల్లీబిడ్డల వార్డును పరిశీలించారు. వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా యంత్రాంగం ఆస్పత్రికి చేరుకుంది. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఘటనపై ఆరాతీశారు. రాయ్‌పూర్ నుంచి అంబికాపూర్‌కు మంత్రి బయలుదేరారు.

విషాద ఘటనపై కలెక్టర్ కుందన్ కుమార్ మాట్లాడుతూ.. 4-5 గంటల వ్యవధిలో నలుగురు చిన్నారులు మరణించినట్లు తెలిపారు. అయితే, కరెంట్ లోపంతోనే ఈ ఘటన జరిగిందని చెప్పలేమని అన్నారు. వెంటిలేటర్లు కూడా ఆగిపోలేదని, పూర్తి వివరాలు విచారణ జరుపుతున్నామని తెలిపారు. వెంటిలేటర్ ఆగిపోయిందా లేదా అనే విషయం విచారణలో తెలుస్తుందని కలెక్టర్ అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com