కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాలు ప్రారంభం..

- February 24, 2023 , by Maagulf
కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాలు ప్రారంభం..

రాయ్‌పూర్‌: ప్రతి సంవత్సరం కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ప్లీనరీ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఛత్తీస్‌ఘడ్‌లోని రాయ్‌పూర్‌లో పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో 85వ సమావేశాల్ని నిర్వహిస్తున్నారు. శుక్రవారం నుంచి ఆదివారం వరకు ఈ సమావేశాలు సాగుతాయి.

ఈ సమావేశాలకు ఖర్గేతోపాటు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, పార్టీకి చెందిన ఇతర నేతలు, ఎంపీలు హాజరవుతారు. ప్లీనరీకి ముందు కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ భేటీ కూడా జరుగుతుంది. స్టీరింగ్ కమిటీ భేటీకి సోనియా, రాహుల్ హాజరు కాకపోవచ్చు. పార్టీకి సంబంధించిన విషయాల్లో ఖర్గేకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చే ఉద్దేశంతో మాత్రమే వాళ్ళు ఈ భేటీకి దూరంగా ఉండనున్నారు. మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న ప్లీనరీ కావడంతో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ప్లీనరీలో ఖర్గేను అధ్యక్షుడిగా ఖరారు చేస్తూ మొదటి తీర్మానం చేస్తారు.

అనంతరం దేశ రాజకీయ, ఆర్థిక, అంతర్జాతీయ వ్యవహారాలు, రైతులు-వ్యవసాయం, సామాజిక న్యాయం-సాధికారత, యువత-విద్య-నిరుద్యోగం వంటి అంశాలపై తీర్మానాలు చేస్తారు. ఈ వ్యవహారాల కోసం పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ ఛైర్మన్‌గా 21 మందితో డ్రాఫ్టింగ్ కమిటీని ఖర్గే నియమించారు. ఈ సంవత్సరం తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ఈ ప్లీనరీ పార్టీకి కీలకంగా మారనుంది. 2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఈ ప్లీనరీలో పార్టీ విధాన నిర్ణయాన్ని, వ్యూహాన్ని ఖరారు చేస్తారు. దేశంలో రాజకీయ, ఆర్థిక పరిస్థితులు, బీజేపీ విధానాలపై ప్రధానంగా ఈ ప్లీనరీలో చర్చిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com