కొత్త రకం మాదకద్రవ్యాలపై యూఏఈ పోలీసుల హెచ్చరిక

- March 04, 2023 , by Maagulf
కొత్త రకం మాదకద్రవ్యాలపై యూఏఈ పోలీసుల హెచ్చరిక

యూఏఈ: ఇటీవల కొత్త రకాల చట్టవిరుద్ధమైన మాదకద్రవ్యాలను గుర్తించినట్లు యూఏఈ పోలీసులు తెలిపారు. ఇవి సమాజానికి మరింత తీవ్రమైన ముప్పును కలిగించడంతోపాటు మరణానికి కూడా కారణం కావచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు మాదకద్రవ్యాలను చలామణి చేసేందుకు ట్రాఫికర్లు కొత్త మార్గాలతో ముందుకు రావడంతో మరింతగా అప్రమత్తం అవుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం యూఏఈలో సింథటిక్ డ్రగ్స్ వినియోగం పెరిగిందని, ఇలాంటి మానవ నిర్మిత మాదక ద్రవ్యాల వినియోగం ప్రాణాంతకం కాగలవని షార్జా పోలీసులు ప్రకటించారు. కొత్త రకాల సింథటిక్ గంజాయిని సౌందర్య సాధనాల కోసం ప్యాకేజింగ్‌లో దాచి సరఫరా చేస్తున్నట్లు ఇటీవల గుర్తించినట్లు షార్జా పోలీస్ క్రిమినల్ లాబొరేటరీ డిపార్ట్‌మెంట్ యాక్టింగ్ హెడ్ కల్నల్ అడెల్ అహ్మద్ అల్ మజ్మీ చెప్పారు.

సింథటిక్ గంజాయి: ఇది ఎందుకు ప్రమాదకరం?
ఈ పదార్థాలు ప్రయోగశాలలో తయారు చేస్తారు. సహజ గంజాయిలోని క్రియాశీల పదార్ధంతో సమానంగా ఇది ఉంటుంది.  వాటిని నేరంగా పరిగణించే విధంగా డ్రగ్స్ పట్టికలో చేర్చే పనిలో అధికారులు ఉన్నారని అల్ మజ్మీ తెలిపారు. ఇదిలా ఉండగా.. ల్యాబ్ లలో తయారు అవుతున్న కొత్త రకాల సింథటిక్ డ్రగ్స్ సమాజానికి మరింత ప్రమాదకరమైన ముప్పుగా ఉన్నాయని షార్జా ఫోరెన్సిక్ లాబొరేటరీలో రసాయన నిపుణుడు డాక్టర్ తాజ్ అల్ సర్ అబ్బాస్ అహ్మద్ ధృవీకరించారు. ఇది సహజ హషీష్ కంటే 80 నుండి 100 రెట్లు మత్తుగా ఉంటుందని పేర్కొన్నారు. వీటి మోతాదు మించితే మరణానికి దారి తీయొచ్చని హెచ్చరించారు.

క్రిమినల్ కెమిస్ట్రీ విభాగం అధిపతి ఐషా అల్ తునైజీ మాట్లాడుతూ..  ఇటీవల కనుగొన్న సింథటిక్ కానబినాయిడ్స్, ఇతర మానవ నిర్మిత మందులు తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయన్నారు. హృదయ స్పందన రేటు పెరగడం, రక్తపోటు, ఎరుపు కళ్ళు, ఆందోళన, మతిస్థిమితం, మూర్ఛ,  జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం అవుతాయని తెలిపారు.  

ప్రమాదంలో యువత
దుబాయ్ పోలీస్‌లోని యాంటీ నార్కోటిక్ డిపార్ట్‌మెంట్‌లోని ఒక ఉన్నత అధికారి మాట్లాడుతూ.. సాధారణంగా ఇటువంటి సింథటిక్ డ్రగ్స్ ఉపయోగించే వారిలో యువత కూడా ఉన్నారని, ఎందుకంటే అవి చౌకగా వారికి అందుబాటులో ఉంటాయని తెలిపారు. యువకులు ఈ సింథటిక్ మత్తు మందులను ఫార్మసీలలో సులువుగా పొందుతారని చెప్పారు.

ఇ-సిగరెట్లు
ఇటీవల పట్టుబడిన 103 ఈ-సిగరెట్లను ఎవిడెన్స్ డిపార్ట్‌మెంట్ పరిశీలించగా.. వాటిలో 17 డ్రగ్స్ తాగేందుకు వినియోగించినట్లు తేలింది. లిక్విడ్ రూపంలో వచ్చే 'స్పైస్' అనే సింథటిక్ గంజాయితో సహా మిక్స్డ్ డ్రగ్స్‌ను యువకులు ఈ-సిగరెట్లతో ఉపయోగిస్తున్నారని అధ్యయనంలో తేలింది.   

సింథటిక్ డ్రగ్స్ వ్యాప్తికి చెక్ 
తల్లిదండ్రులు, పాఠశాలలు సింథటిక్ డ్రగ్స్ వ్యాప్తిని నియంత్రించడంలో సహాయపడాలని దుబాయ్ పోలీసు అధికారి కోరారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులలో అవగాహన కల్పించడం వలన వీటి వ్యాప్తిని సులభంగా అరికట్టవచ్చన్నారు. మాదకద్రవ్యాల వ్యాప్తిని నిరోధించేందుకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI), విద్యా సంస్థలు విస్తృత ప్రయత్నాలు చేస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com