మరోసారి భారతీయ అత్యంత ధనవంతుడిగా నిలిచిన ముకేశ్ అంబానీ
- March 23, 2023
ముంబై: దేశీయ అపర కుబేరుడిగా మరోసారి ముకేశ్ అంబానీ రికార్డులకెక్కారు. 8,100 కోట్ల డాలర్లతో ప్రపంచ కుబేరుల జాబితాలో నిన్నమొన్నటి వరకు రెండో స్థానంలో ఉన్న గౌతం అదానీ ఏకంగా 23వ స్థానానికి పడిపోయారు. ‘ఎం3ఎం హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్-2023’ పేరుతో విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ అంతర్జాతీయ సంపన్నుల జాబితా టాప్-10లో 9వ స్థానంలో నిలిచారు. ఈ జాబితాకెక్కిన ఏకైక భారతీయుడు ఆయనే. అంబానీ నికర సంపద 82 బిలియన్ డాలర్లుగా హురున్ పేర్కొంది. నిజానికి గత గతేడాదితో పోలిస్తే అంబానీ సంపద 20 శాతం అంటే 21 బిలియన్ డాలర్లు తగ్గినప్పటికీ, అదానీ సంపద విలువ మరింత క్షీణించడంతో దేశీయ సంపన్నుల జాబితాలో అంబానీ మళ్లీ అగ్రస్థానాన్ని ఆక్రమించారు.
అదానీపై హిండెన్బర్గ్ వెలువరించిన నివేదిక ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అదానీ సంపద పెరగడానికి మార్కెట్ మాయాజాలమే కారణమని ఆ నివేదిక సంచలన ఆరోపణలు చేసింది. దీంతో అదానీ కంపెనీ షేర్లు ఢమాల్మన్నాయి. ఫలితంగా అదానీ గ్రూప్ కంపెనీల విలువ 140 బిలియన్ డాలర్లు ఆవిరయ్యాయి. అంతకుముందు అదానీ అంతర్జాతీయ కుబేరుల స్థానంలో రెండో స్థానంలో ఉండేవారు. గ్రూప్ కంపెనీలతోపాటు వ్యక్తిగత సంపద కూడా కరిగిపోవడంతో ఆయన ఇప్పుడు ప్రపంచ సంపన్నుల జాబితాలో 23వ స్థానానికి పడిపోయారు. ఆయన ఏడాది వ్యవధిలోనే 35 శాతం అంటే దాదాపు 28 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయారు. 2022-23లో వారానికి 3 వేల కోట్ల రూపాయల చొప్పున అదానీ నష్టపోయినట్టు నివేదిక పేర్కొంది.
ఇక, ఏడాది కాలంలో అత్యంత ఎక్కువ సంపదను కోల్పోయిన వారిలో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మొదటి స్థానంలో ఉన్నారు. ఆయన దాదాపు 70 బిలియన్ డాలర్ల సంపదను ఏడాది కాలంలో కోల్పోయారు. అంబానీ, అదానీ కలిపి పోగొట్టుకున్న సంపదతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ కావడం గమనార్హం. ఆసియా అపర కుబేరుల్లో ఇప్పటి వరకు రెండో స్థానంలో ఉన్న అదానీ స్థానంలో ఇప్పుడు చైనాకు చెందిన ఝెంగూ శాన్శాన్ వచ్చి చేరారు. భారత్తో పోలిస్తే చైనాలో ఐదురెట్లు ఎక్కవమంది సంపన్నులు ఉన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..