షార్జాలో బోటు ప్రమాదం.. ఆపరేటర్లకు పోలీసుల హెచ్చరికలు

- April 26, 2023 , by Maagulf
షార్జాలో బోటు ప్రమాదం.. ఆపరేటర్లకు పోలీసుల హెచ్చరికలు

యూఏఈ: గత శుక్రవారం ఖోర్ ఫక్కన్ బీచ్‌లో భారతీయ ప్రవాసిని బలికొన్న సంఘటన తర్వాత షార్జా అధికారులు ఎమిరేట్‌లో పడవ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. టూరిస్ట్ బోట్ కంపెనీ నిర్లక్ష్యం కారణంగా ఒక ప్రవాస భారతీయుడు మరణించగా.. మరో నలుగురు ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. సదరు కంపెనీపై అభియోగాలు మోపబడి, పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేసినట్లు షార్జా పోలీస్ కమాండర్-ఇన్-చీఫ్, మేజర్-జనరల్ సైఫ్ అల్ జరీ అల్ షమ్సీ తెలిపారు. సంఘటన తరువాత అత్యవసర ప్రతిస్పందన బృందాన్ని సంఘటన స్థలానికి పంపినట్లు పేర్కొన్నారు. దర్యాప్తు అనంతరం ప్రమాదం జరిగిన సమయంలో బోట్ లో ఉన్న సిబ్బందిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. నిర్దేశిత సంఖ్య కంటే అధికంగా పర్యాటకులను అనుమతించడమే ప్రమాదానికి కారణమని తమ విచారణలో తేలిందన్నారు. ప్రమాదం జరిగే సమయంలో బోట్‌లో మొత్తం 16 మంది వ్యక్తులు ఉన్నారని, డ్యూటీలో ఉన్న సిబ్బందితో సహా ఓడలో గరిష్టంగా 10 మందికి మాత్రమే అనుమతి ఉందని మేజర్-జనరల్ అల్ షమ్సీ తెలిపారు. బోట్ బోల్తా ఘటన అనంతరం ఎమిరేట్‌లోని ఇతర బోట్ ఆపరేటర్లందరికీ హెచ్చరిక జారీ చేయడంతోపాటు భద్రతా నియమాలకు అనుగుణంగా తనిఖీ చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిబంధనలను పాటించని బోట్ లను సీజ్ చేసినట్లు.. చాలా ఆపరేటర్లు బోట్ సామర్థ్యాన్ని మించి  పర్యాటకులను తీసుకెళ్తూ పట్టుబడ్డారని మేజర్-జనరల్ అల్ షమ్సీ వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com