సూడాన్ నుంచి వచ్చిన భారతీయులకు క్వారంటైన్
- April 29, 2023
న్యూఢిల్లీ: సూడాన్ నుంచి వచ్చిన భారతీయులు ఎల్లో ఫీవర్ ధృవీకరణ పత్రాన్ని చూపకపోతే వారిని అధికారులు క్వారంటైన్లకు తరలిస్తున్నారు. జెడ్డా నుండి నాలుగు విమానాల్లో 1,360 మంది భారతీయులు శుక్రవారం తరలివచ్చారు. ఢిల్లీ, ముంబై విమానాశ్రయాల్లో ల్యాండ్ అయిన మొదటి రెండు విమాన ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. అక్కడి నుంచి వచ్చిన ప్రయాణీకులు సాఫీగా ఇళ్లకు చేరుకున్నారు. అయితే ఆ తర్వాత బెంగళూరు, ఢిల్లీలో ల్యాండ్ విమాన ప్రయాణీకులకు అధికారులు నిబంధనలు అమలు చేశారు. ఎల్లో ఫీవర్ ధృవీకరణ పత్రం చూపించిన వారినే ఇంటికి పంపించారు. ఆ పత్రం చూపించని వారిని ఆరురోజులపాటు క్వారంటైన్కోసం ఆసుపత్రులకు తరలించారు. ఈ చర్య వల్ల వేలాదిమందిలో ఓ 25 మంది ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎంతో కష్టపడి స్వదేశానికి చేరిన తర్వాత.. అయినవారికి, పిల్లలకు దూరంగా క్వారంటైన్లో ఉండడం.. బాధకలిగిస్తోందని ప్రయాణీకులు వాపోతున్నారు. సుప్రియా అనే ఆమె ఆరేళ్లుగా సూడాన్లో ఉంటుంది. భర్త, కుమారుడితో కలిసి బెంగళూరు విమానాశ్రయంలో భారత్కి చేరింది. అయితే ఆమెకు ఎల్లో ఫీవర్ సర్టిఫికెట్ లేకపోవడంతో.. ఆమెను అధికారులు క్వారంటైన్ కోసం ఆసుపత్రికి తరలించారు. దీనిపై ఆమె మాట్లాడుతూ.. 'మేము కీలకపత్రాలన్నింటినీ భద్రత కోసం మా స్నేహితుల వద్ద ఉంచాము. వాటిని ఇప్పుడెలా తీసుకొస్తాము. యుద్ధం రెండురోజులే కొనసాగుతుందనుకున్నాము. ఆ తర్వాత అది ముగిసేలా లేదు. దాంతో మేము అక్కడి నుంచి వెంటనే ఖాళీ చేయాల్సి వచ్చింది. దీంతో మేము పత్రాలను తీసుకురాలేకపోయాము' అని మీడియాకు వివరించారు. ఇక ఖార్టూమ్లో ఆక్సిజన్ ప్లాంట్లో టెక్నీషియన్గా పనిచేసి ఇక్కడికి వచ్చిన బరుబా సబీర్ అనే వ్యక్తి కూడా వ్యాక్సినేషన్ పత్రాన్ని అధికారులకు చూపించలేదు. దీంతో అతన్ని కూడా అధికారులు ఆసుపత్రికి తరలించారు. కర్ణాటక సంచార వర్గానికి చెందిన హక్కీపిక్కీ తెగకు చెందిన 100 మంది కూడా సూడాన్కి వెళ్లారు. వీరు తయారుచేసిన ఔషధ నూనెను విక్రయించడానికి వారు వివిధ దేశాలకు వెళతారు. అలా వీరు సూడాన్కి వెళ్లారు. అక్కడి నుంచి భారత్కి వచ్చిన విమానంలో ఈ హిక్కీ పిక్కీ సభ్యులను వేరు చేశారని తెలియడంతో.. ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య విదేశాంగమంత్రి ఎన్ జై.శంకర్పై ధ్వజమెత్తారు. వచ్చేనెల ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. బిజెపి ఉద్దేశపూర్వకంగానే రాజకీయాలు చేస్తోందని ఆయన తన ట్వీట్లో ఆరోపించారు.
కాగా, మిలటరీ, పారామిలటరీ మధ్య జరుగుతున్న అధికార పోరులో వివిధ దేశాల ప్రజలు నలిగిపోతున్నారు. దీంతో అక్కడి నుంచి స్వదేశాలకు ప్రజలు తిరిగి వస్తున్నారు. 3,400 మంది భారతీయులు స్వదేశానికి వచ్చేందుకు అక్కడున్న రాయబార కార్యాలయంలో నమోదు చేసుకున్నారు. వీరందరినీ 'ఆపరేషన్ కావేరి'లో భాగంగా ప్రభుత్వం స్వదేశానికి తీసుకొస్తుంది. వీరిలో శుక్రవారం రోజుకి 1,360మంది మాత్రమే భారత్కి వచ్చారు.
తాజా వార్తలు
- అమెరత్–బౌషర్ మౌంటేన్ రోడ్ రెండు రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో MoHRE ఫీజులు, ఫైన్స్ ఈఎంఐల్లో చెల్లించే అవకాశం..!!
- గోల్డ్ ట్రేడ్ మనీలాండరింగ్పై కువైట్ స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ పాస్పోర్ట్ తో 112 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం..!!
- సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..







