భానుడి ప్రతాపానికి మండుతున్న విజయవాడ...సెల్ టవర్ దగ్ధం

- May 15, 2023 , by Maagulf
భానుడి ప్రతాపానికి మండుతున్న విజయవాడ...సెల్ టవర్ దగ్ధం

విజయవాడ: నగరంలోని కృష్ణలంక బాలాజీనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. భానుడి ప్రతాపంతో సెల్ టవర్ దగ్ధమైంది. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు బిల్డింగ్‌పై అధికారులు సెల్ టవర్లను ఏర్పాటు చేశారు. అయితే ఎండ వేడిమికి మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో సెల్ టవర్‌లో మంటలు చెలరేగాయి. దీంతో వైర్లు, బ్యాటరీలు, ఇతర పరికరాలు పూర్తిగా తగలపడిపోయాయి. సమాచారం అందిన వెంటనే కృష్ణలంక పోలీసులు అక్కడకు చేరుకుని బిల్డింగ్ చుట్టుపక్కల వారిని బయటకి పంపించి వేశారు. హుటాహుటిన విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. డిప్యూటీ మేయర్‌ బెల్లం దుర్గ ఘటనా స్థలానికి చేరుకుని అధికారులు, ప్రజలతో మాట్లాడారు.

ఘటనపై సీఐ దుర్గారావు మాట్లాడుతూ... సెల్ టవర్ దగ్ధం అవుతున్న సమాచారం రాగానే ఘటనా స్థలానికి‌ చేరుకున్నామన్నారు. చుట్టుపక్కల వాళ్లను ఇళ్లల్లో నుంచి బయటకు తీసుకు‌వచ్చామని.. విద్యుత్ సరఫరా నిలిపివేసి మంటలను అదుపు‌ చేసేందుకు ప్రయత్నించామని తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి పూర్తిగా మంటలను అదుపు చేశారన్నారు. ప్రమాదంలో సెల్ టవర్, కేబుళ్లు, బ్యాటరీలు దగ్ధం అయ్యాయన్నారు. ఎండ వేడిమి వల్లే షార్ట్ సర్క్యూట్ అయినట్లు భావిస్తున్నామని... ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని సీఐ దుర్గారావు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com