'డయల్-100'ను ఏకీకృత సర్వీసు..

- May 16, 2016 , by Maagulf
'డయల్-100'ను ఏకీకృత సర్వీసు..

నగరంలో రెండు రోజులు గాలివాన సృష్టించిన బీభత్సానికి చెట్లు నేలకొరిగాయి. వీటిని తొలగించాల్సిన బాధ్యత జీహెచ్‌ఎంసీకి ఉన్నా... ఫిర్యాదులు మాత్రం ట్రాఫిక్ పోలీసులకు వస్తున్నాయి. వానాకాలం వచ్చిందంటే చాలు శిధిలావస్థలో ఉన్న నిర్మాణాలు, గోడలు కూలుతున్నాయి. ఈ సమాచారం సైతం పోలీసులకే అందుతుండటంతో ప్రాథమికంగా పారలు, పలుగులు పట్టుకుని వారే రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్స్ చేయాల్సి వస్తోంది. ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయ లోపంతో ఈ పరిస్థితులు తలెత్తుతున్నాయి.వీటికి పరిష్కారంగా ప్రకృతి వైపరీత్యాలు, ఇతర అత్యవసర సమయాల్లో ప్రజల నుంచి సమాచారం, ఫిర్యాదులు అందుకున్న వెంటనే స్పందించేందుకు 'డయల్-100'ను ఏకీకృత సర్వీసుగా వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే అమెరికా, లండన్‌లలో '911' నంబర్ ద్వారా అమలులో ఉన్న ఈ తరహా 'కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్' (సీసీసీ) విధానంపై అధ్యయనానికి ప్రత్యేక బృందాన్ని పంపిస్తోంది. డీజీపీ అనురాగ్‌శర్మ, హోంసెక్రటరీ రాజీవ్ త్రివేది, ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు, నగర కొత్వాల్ ఎం.మహేందర్‌రెడ్డి, ట్రాఫిక్ చీఫ్ జితేందర్, రీ-ఆర్గనైజేషన్ వింగ్ ఎస్పీ రమేష్‌రెడ్డితో పాటు సిటీ ఐటీ సెల్ అడ్వైజర్ జీవన్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్ శ్రీనాథ్‌రెడ్డితో కూడిన ఈ బృందం మంగళవారం ఉదయం అమెరికాకు బయలుదేరుతోంది. అక్కడ నుంచి లండన్‌లోనూ పర్యటించి ఈ నెల 30న తిరిగి వస్తుంది.
ఇన్‌చార్జ్ సీపీగా అంజనీకుమార్... నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి అధికారిక పర్యటన నిమిత్తం అమెరికా, లండన్‌లకు వెళ్తున్న క్రమంలో ఇన్‌చార్జ్ కొత్వాల్‌గా శాంతిభద్రతల విభాగం అదనపు సీపీ అంజనీకుమార్ వ్యవహరించనున్నారు. ట్రాఫిక్ చీఫ్ జితేందర్ స్థానంలో నేర విభాగం అదనపు సీపీ స్వాతి లక్రా ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com