తార్నాకలో అత్యాధునిక‌ హంగులతో టీఎస్‌ఆర్టీసీ నర్సింగ్‌ కళాశాల

- September 16, 2023 , by Maagulf
తార్నాకలో అత్యాధునిక‌ హంగులతో టీఎస్‌ఆర్టీసీ నర్సింగ్‌ కళాశాల

హైదరాబాద్: హైదరాబాద్ తార్నాకలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC) నర్సింగ్  కాలేజీ నూతన భవనం విద్యార్థులకు అందుబాటులోకి వచ్చింది. ఈ బిల్డింగ్ ను అత్యాధునిక హంగులతో నిర్మించింది. ఇవాళ(శనివారం) నర్సింగ్ కళాశాల నూతన భవనాన్ని సంస్థ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జనర్ ప్రారంభించారు. ఆ తర్వాత తరగతి గదులు, ల్యాబొరేటరీలను పరిశీలించారు. నూతన భవనంలో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తార్నాక టీఎస్ఆర్టీసీ ఆస్పత్రికి అనుసంధానంగా 2021-22 అకాడమిక్ ఇయర్ నుంచి నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేశామని తెలిపారు సంస్థ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్. నర్సింగ్ కోర్సులు పూర్తి చేసిన వారికి వైద్య రంగంలో మంచి భవిష్యత్ ఉందని,  విద్యార్థులందరూ టీఎస్ఆర్టీసీ అందిస్తోన్న నర్సింగ్ కోర్సులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆస్పత్రుల్లో నర్సులు కుటుంబ సభ్యుల్లా రోగులను పరిగణించి.. అత్యుత్తమ సేవలను అందిస్తున్నారని తెలిపారు. చికిత్స సమయంలో రోగులకు తల్లికంటే ఎక్కువగా సేవలు అందిస్తూ ఎందరో ప్రాణాలను నిలబెడుతున్న నర్సుల సేవలు ఎనలేనివన్నారు.సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో సంస్థ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ నిర్ణయం తీసుకున్నారని, ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్.

నర్సింగ్‌ కోర్సుకు మంచి డిమాండ్‌ ఉందన్నారు సంస్థ వైస్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వి.సి.సజ్జనర్‌. కోర్సు పూర్తి చేసిన నర్సింగ్‌ విద్యార్థులకు విదేశాలలోనూ అవకాశాలు చాలా వస్తున్నాయన్నారు. అందుకే, కష్టపడి చదివి విద్యార్థులు నైపుణ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో రూ.10 కోట్ల వ్యయంతో నాలుగు అంతస్థుల భవన సముదాయాన్ని TSRTC నిర్మించింది. 50 మంది విద్యార్థులతో 2021-22 అకాడమిక్ ఇయర్ లో ప్రారంభమైన ఈ కళాశాలలో మేనేజ్‌మెంట్ కోటా 20 సీట్లలో RTC ఉద్యోగుల పిల్లలకు యూనివర్సిటీ విద్యార్థులతో సమానంగా ఐదు సీట్లు కేటాయించడం జరుగుతోంది. నర్సింగ్ కోర్సులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినులు త్రిష, అమూల్యను ఘనంగా సన్మానించారు. త్రిషకు రూ.10 వేలు, అమూల్యకు రూ.7 వేల నగదు పురస్కారాలతో పాటు ప్రశంసా పత్రాలను అందజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com