నైట్రోజన్ గ్యాస్ తో దోషికి తొలిసారి మరణ శిక్ష..
- January 27, 2024
అమెరికా: మరణ శిక్షే వద్దని ప్రపంచలోని చాలా దేశాల్లో డిమాండ్ వినిపిస్తుంటే.. అమెరికా మాత్రం కొత్త మార్గాల్లో మరణ శిక్ష అమలు పై ప్రయోగాలు చేస్తోంది. తాజాగా అమెరికా అమలు చేసిన ఓ మరణ శిక్ష అత్యంత క్రూరంగా సాగింది. అమెరికాలోని అలబామా రాష్ట్రంలోని 58ఏళ్ల కెన్నెత్ ఎజెన్ స్మిత్ అనే నేరస్థుడికి అమలు చేసిన మరణ శిక్ష ఎంత భయకరంగా ఉందంటే ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆ క్రూరత్వం గురించే మాట్లాడుకుంటోంది. ఇది అత్యంత అమానవీయమని ఐక్యరాజ్య సమితి, యురోపియన్ యూనియన్ మానవహక్కుల సంస్థలు ఘోషిస్తున్నాయి. సాక్షాత్తూ వైట్ హౌస్సే ఈ దారుణాన్ని ఖండించింది. ప్రయోగాత్మక మరణ శిక్షలు ఆపాలని కోరుతూ ఉద్యమం జరుగుతుంది.
స్మిత్ 30ఏళ్ల క్రితం చేసిన ఓ సుపారీ హత్యకు మూడు దశాబ్దాల తరువాత అత్యంత దారుణమైన శిక్ష అనుభవించాడు. అల్బామా కోర్టు ఇచ్చిన తీర్పుప్రకారం అధికారులు ఈ మరణ శిక్షను అమలు చేశారు. ప్రపంచంలో ఎన్నడూలేని విధంగా తొలిసారి స్వచ్ఛమైన నైట్రోజన్ గ్యాస్ తో స్మిత్ మరణించేలా చేశారు. దోషులకు ఇది అత్యంత తేలికైన మరణ విధానంగా అమెరికా ప్రచారం చేసుకోగా.. వాస్తవంలో ఆ మరణ శిక్ష అమలు హాలీవుడ్ హర్రర్ సినిమాలను తలపించేంత భయకరంగా, క్రూరంగా అమానవీయ పద్దతిలో సాగిందని స్మిత్ ప్రాణాలు ఆనంతవాయువుల్లో కలిసిపోవడాన్ని ప్రత్యక్షంగా చూసిన ఆధ్యాత్మిక సలహాదారు రెవరెండ్ జఫ్ హుడ్ తెలిపాడు.స్మిత్ ను ముందు ఓ మంచంపై పడుకోబెట్టారు. కాళ్లూచేతులు కట్టేశారు. ఆ తరువాత ముఖానికి నైట్రోజన్ మాస్క్ ను తొడిగారు. ఆ తరువాత నెమ్మదిగా స్వచ్ఛమైన నైట్రోజన్ గ్యాస్ పంపడం మొదలు పెట్టారు. నైట్రోజన్ సరఫరా మొదలైన తరువాత కాసేపు స్మిత్ స్పృహలోనే ఉన్నాడు. తరువాత రెండుమూడు నిమిషాలు శ్వాస అందనట్లుగా కాళ్లూచేతులు ఆడించాడు. శ్వాస తీసుకోవడానికి వీలులేక నరకయాత అనుభవించాడు. ఆ తరువాత క్రమంగా శరీరంలో కదలికలు ఆగిపోయాయి. స్మిత్ శరీరంలోకి 15 నిమిషాలపాటు నైట్రోజన్ గ్యాస్ సరఫరా జరిగింది. 22 నిమిషాల తరువాత స్మిత్ చనిపోయినట్లు ప్రకటించారు.
నైట్రోజన్ శిక్ష అమలుకు ముందు అధికారులు ఇది సునాయాసంగా మనుషులను చంపే ప్రక్రియ అని చెప్పారు. క్షణాల్లోనే మనిషి స్పృహ కోల్పోతాడని, వెంటనే మరణం సంభవిస్తుందని చెప్పారు. కానీ, స్మిత్ మరణించిన తీరు చూసిన వారికి ఆ శిక్ష ఎంత కఠినాతి కఠినమైందో, ఎంత హృదయ విదారకమైందో అర్థమైంది. శ్వాస అందక నిమిషాలపాటు స్మిత్ తన్నుకులాడారు. జైలు అధికారులుసైతం తన్నుకులాడుతున్న దృశ్యాలనుచూసి షాక్ తిన్నారు.
తాజా వార్తలు
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!







