నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీ

- February 27, 2024 , by Maagulf
నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీ

న్యూఢిల్లీ: గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లేందుకు ఎంపికైన నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. గ్రూప్ కెప్టెన్లు పి.బాలకృష్ణన్ నాయర్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్​తోపాటు వింగ్ కమాండర్ ఎస్ శుక్లా అంతరిక్షంలోకి వెళ్లనున్నట్లు తెలిపారు. వీళ్లతో మోడీ ముచ్చటించారు. ఈ వ్యోమగాములను 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను నెరవేర్చే నాలుగు శక్తులుగా అభివర్ణించారు మోడీ. కేరళ తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్​లో గగన్​యాన్ ప్రాజెక్టు పురోగతిని మోడీ పరిశీలించారు.

21వ శతాబ్దంలో భారత్ ప్రపంచస్థాయి దేశంగా అవతరిస్తోందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. అన్ని రంగాల్లో పురోగమిస్తోందని తెలిపారు. చంద్రయాన్, గగన్​యాన్ వంటి ప్రాజెక్టుల్లో మహిళల పాత్ర ఎనలేనిదని మోడీ కొనియాడారు. వారి భాగస్వామ్యం లేనిదే ఈ ప్రాజెక్టులు సాధ్యమయ్యేవి కాదని అన్నారు. గగన్​యాన్ మిషన్​లో చాలా వరకు భారత్​లో తయారైన పరికరాలను ఉపయోగించడం గర్వకారణమని చెప్పారు.

“దేశాభివృద్ధి ప్రయాణంలో కొన్ని ఘట్టాలు భవిష్యత్​ను నిర్దేశించేవిగా ఉంటాయి. ఇది అలాంటి క్షణమే. గగన్​యాన్ మిషన్​కు ఎంపికైన నలుగురు వ్యోమగాములు ఇప్పుడు దేశానికి పరిచయం అయ్యారు. వీరు నలుగురు వ్యక్తులు మాత్రమే కాదు, 140 కోట్ల మంది ఆకాంక్షలను అంతరిక్షంలోకి తీసుకెళ్లే శక్తులు. 40 ఏళ్ల తర్వాత ఓ భారతీయుడు స్పేస్​లో అడుగుపెట్టనున్నారు. కానీ ఈసారి వ్యోమగాములను పంపించే రాకెట్ మనం సొంతంగా తయారు చేసుకున్నది. టైమ్, కౌంట్​డౌన్ అన్నీ మనవే.”

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com