మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- July 17, 2026
ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వంటి సమర్థవంతమైన నేతల పాలనలో దేశ ముఖచిత్రం పూర్తిగా మారిపోయిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కొనియాడారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ప్రభుత్వ రంగ బ్యాంకులు సంయుక్తంగా ఏర్పాటు చేసిన భారీ ‘క్రెడిట్ అవుట్రీచ్’ (రుణమేళా) వేదిక పై ఆమె మాట్లాడారు. గతంలో 2004 నుండి 2014 మధ్య కాలంలో ఢిల్లీ నుంచి వచ్చే సిఫార్సు ఫోన్ కాల్స్ ఆధారంగానే పెద్దలకు రుణాలు దక్కేవని, కానీ ప్రస్తుతం ఆ ‘ఫోన్ బ్యాంకింగ్’ సంస్కృతికి స్వస్తి పలికామని చెప్పారు. ఇప్పుడు బ్యాంకులు స్వయంగా ప్రజల ముంగిటకే వచ్చి అర్హులైన వారికి అండగా నిలుస్తున్నాయని వెల్లడించారు. ఈ వేదికపై సీఎం చంద్రబాబుతో పాటు రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మరియు పలు బ్యాంకుల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
చిరు వ్యాపారులకు, మహిళలకు కొండంత అండ
బ్యాంకులు ప్రజల వద్దకే వెళ్లి సేవలు అందించాలన్నదే ప్రధాని మోదీ అసలు ఉద్దేశమని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ప్రస్తుతం బ్యాంకింగ్ రంగాన్ని మరింత సులభతరం చేశామని, ఎలాంటి గ్యారెంటీ (హామీ) లేకపోయినా అర్హులకు రుణాలు అందిస్తున్నామని చెప్పారు. చివరకు వీధి వ్యాపారులకు సైతం ప్రభుత్వమే గ్యారెంటీగా నిలిచి ముద్ర యోజన వంటి పథకాల ద్వారా ఆర్థిక చేయూతనిస్తోందని వివరించారు. సామాన్యులు అధిక వడ్డీల వ్యాపారుల బారిన పడి నష్టపోకుండా ఉండేందుకు, మైక్రో ఫైనాన్స్ విధానం ద్వారా మహిళలను, చిన్న వ్యాపారులను ఆదుకోవడమే ఎన్డీయే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
‘వికసిత్ భారత్’ లక్ష్యంగా అడుగులు.. సేవా కార్యక్రమాల ప్రారంభం
దేశంలో బ్యాంకుల పనితీరుతో పాటు ప్రజల్లో బ్యాంకింగ్ పట్ల ఉన్న నమ్మకం కూడా పెరిగిందని, నరసరావుపేటలో జరిగిన ఈ భారీ రుణమేళానే అందుకు ప్రత్యక్ష నిదర్శనమని కేంద్ర మంత్రి కొనియాడారు. సాధారణ ప్రజలు సైతం పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు బ్యాంకులు కోట్లాది రూపాయల మేర రుణాలను అందిస్తున్నాయని తెలిపారు. 2047 నాటికి భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా, ‘వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన దేశం)గా నిలబెట్టడమే తమ ప్రభుత్వ అంతిమ ధ్యేయమని ఆమె పునరుద్ఘాటించారు. ఈ పర్యటనలో భాగంగా, సీఎస్ఆర్ (CSR) నిధుల కింద యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించిన ఉచిత అంబులెన్స్లను సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి జెండా ఊపి ప్రారంభించారు. అలాగే, పాఠశాల విద్యార్థినులకు సైకిళ్లను పంపిణీ చేయడంతో పాటు వివిధ రంగాలకు చెందిన లబ్ధిదారులకు భారీగా రుణ చెక్కులను అందజేశారు.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







