పాట్నాలోని ఓ హోటల్లో భారీ అగ్నిప్రమాదం..6 గురు మృతి..
- April 25, 2024పాట్నా: బిహార్ రాష్ట్రంలోని పాట్నాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం ఓ హోటల్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా కనీసం 30 మందికి పైగా గాయపడినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటన పాట్నాలోని కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని గోలాండర్లో చోటు చేసుకుంది. మృతుల్లో ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు.
గ్యాస్ సిలిండర్ పేలడం వల్ల మంటలు చెలరేగాయని స్థానికులు చెబుతున్నారు. సిలిండర్ పేలవడంతో క్షణాల్లోనే మంటలు భవనం మొత్తం వ్యాపించాయన్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. పలువురు గాయపడగా వారిని పాట్నాలోని పీఎంసీహెచ్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
హోటల్ నుంచి 30 మందికి పైగా రక్షించినట్లు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాజీవ్ మిశ్రా తెలిపారు. ఉదయం 11 గంటల సమయంలో ప్రమాదం గురించి సమాచారం అందిందని, ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (ఫైర్ సర్వీస్) మృత్యుంజయ్ కుమార్ చౌదరి తెలిపారు. ఈ ఘటనతో ఆ ప్రాంతం మొత్తం తీవ్ర గందరగోళం నెలకొంది. మంటల కారణంగా దట్టమైన పొగ ఆ ప్రాంతంలో అలుముకుంది.
పాట్నా రైల్వే స్టేషన్కు సమీపంలో ఈ హోటల్ ఉండడంతో చాలా మంది ఈ హోటల్లో భోజనం చేసేందుకు వస్తుంటారని స్థానికులు చెబుతున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న హోంగార్డు, ఫైర్ సర్వీసెస్ డీజీ శోభా ఓహత్కర్ విలేకరులతో మాట్లాడుతూ.. 16,000 కంటే ఎక్కువ హోటళ్లలో ఫైర్ ఆడిట్ చేసినట్లు చెప్పారు. ఇంకా చాలా హోటళ్లలో ఆడిట్ కొనసాగుతోందన్నారు. తమ తనిఖీల్లో కొందరు సూచనలు పాటించలేదని తెలిసిందన్నారు. వారికి నోటీసులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదాన్ని చూస్తుంటే.. సిలిండర్ పేలుడు కారణంగా మంటలు చెలరేగినట్లు కనిపిస్తోంది అని అన్నారు.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్