ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్..

- May 06, 2024 , by Maagulf
ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్..

న్యూ ఢిల్లీ: మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో చుక్కెదురైంది. ఈడీ, సీబీఐ కేసుల్లో ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటీషన్లపై విచారణ చేపట్టిన కోర్టు ప్రత్యేక జడ్జి కావేరీ బవేజా బెయిల్ ను తిరస్కరించారు. ప్రస్తుతం జ్యూడిషియల్ కస్టడీలో భాగంగా కవిత తీహార్ జైలులో ఉన్నారు. ట్రయల్ కోర్టు తీర్పుపై రెండు మూడు రోజుల్లో కవిత హైకోర్టును ఆశ్రయించనున్నారు.

లిక్కర్ పాలసీ కేసులో కవితను కింగ్ పిన్ అని దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. కవిత బెయిల్ పై బయటకు వస్తే ఆధారాలు, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని, రాజకీయంగా పలుకుబడి కలిగిన వ్యక్తిగా కవిత ఉన్నారు కాబట్టి.. కవిత బెయిల్ పై బయటకు వెళ్తే ఈ కేసు దర్యాప్తు పై ప్రభావం పడుతుందని దర్యాప్తు సంస్థలు కోర్టు దృష్టికి తీసుకెళ్లాయి. ఈ కేసు కీలక దశకు వచ్చిందని, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ కేసులో అరెస్టయ్యారని, కవితకు వ్యతిరేకంగా తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని పేర్కొన్న దర్యాప్తు సంస్థలు.. ఆ ఆధారాలన్నీ కోర్టు ముందు సమర్పించాయి. దీంతో ఈడీ, సీబీఐ వాదనలకు ఏకీభవించిన రౌస్ అవెన్యూ కోర్టు కవిత రెండు బెయిల్ పిటీషన్లను తిరస్కరించింది.

కవిత బెయిల్ తిరస్కరణపై ఉత్తర్వులు వచ్చిన తరువాత రెండు మూడు రోజుల్లో కవిత తరపున న్యాయవాదులు ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. అక్కడ కవితకు ఎటువంటి ఊరట లభిస్తుందనేది వేచిచూడాల్సి ఉంది. ఇదిలాఉంటే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ అరెస్టు చేసిన వారిలో ట్రయల్ కోర్టు స్థాయి దశలో ఎవరికి బెయిల్ రాలేదు. ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో స్థాయిల్లోనే కొందరికి బెయిల్ మంజూరు అయింది. హైకోర్టు, సుప్రీంకోర్టులో కవితకు బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com