డాక్టర్ టూ సెంట్రల్ మినిష్టర్..!
- June 11, 2024
2024 ఎన్నికల ముందే, క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చిన పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి భారీ మెజార్టీతో గెలిచారు. తొలిసారి ఎన్నికల్లో పోటీచేసి, గుంటూరు ఎంపీగా మంచి మెజార్టీతో గెలుపొందిన పెమ్మసాని చంద్రశేఖర్కు కేంద్ర మంత్రి పదవి దక్కింది. తొలి ప్రయత్నంలోనే ప్రజల మద్దతు పొంది, కేంద్ర క్యాబినెట్లో చోటు సంపాదించిన పెమ్మసానిపై ప్రత్యేక కథనం.
గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో 1976 మార్చి 7న పెమ్మసాని సాంబశివరావు, సువర్చల దంపతులకు చంద్రశేఖర్ జన్మించారు. చంద్రశేఖర్ తండ్రి సాంబశివరావు.. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ ముఖ్య అనుచరుడిగా ఉంటూ వచ్చిన ఆయన వ్యాపారరీత్యా మాచర్లలో స్థిరపడ్డారు. మాధురి సాంబయ్యగా పల్నాడు ప్రాంత ప్రజలకు చిరపరిచితులు.
చంద్రశేఖర్ 1993-94లో ఎంసెట్లో 27వ ర్యాంకు సాధించి ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. పీజీ చదవడం కోసం 2000లో అమెరికాకు వెళ్లి పీజీ, 2005లో అమెరికాలోని పెన్సిల్వేనియాలోని గీసింజర్ మెడికల్ సెంటర్ నుంచి ఇంటర్నల్ మెడిసిన్లో ఎండీ పట్టా అందుకొని ఆ తరువాత జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీలో ఐదేళ్లపాటు టీచింగ్ ఫ్యాకల్టీగా పని చేశారు.
యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్ పూర్తి చేసేందుకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు సహాయం చేస్తూ చాలా తక్కువకు తాను ప్రిపేర్ చేసుకున్న నోట్స్ ను ఆన్లైన్ లో అందించేవారు. ఆ ప్రయత్నానికి మంచి ఆదరణ దక్కడంతో ఆయన రాసిన మెటీరియల్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. చంద్రశేఖర్ ఆ తరువాత వైద్య విద్యార్థులకు ఆన్లైన్ శిక్షణ ఇచ్చేందుకు 'యు వరల్డ్' సంస్థను ప్రారంభించాడు. ఇందులో నర్సింగ్, ఫార్మసీ, న్యాయ, వాణిజ్యం, అకౌంటింగ్ విభాగాల్లో లైసెన్సింగ్ పరీక్షలకు శిక్షణ ఇచ్చేవారు. వారికి అద్భుతమైన మెటీరియల్ అందించేవారు. అలా తన వ్యాపారాన్ని పెంచుకుంటూ అమెరికాలో ఒక యువ వ్యాపారవేత్తగా ఎదిగారు. ఇప్పటికీ వైద్య పరీక్షకు సిద్ధమయ్యే విద్యార్థులకు యు వరల్డ్ ద్వారా ఆయన శిక్షణ అందిస్తున్నారు.
చంద్రశేఖర్ అమెరికా ఫిజీషియన్ అసోసియేషన్ లో సభ్యుడిగా ఉంటూ.. పెమ్మసాని ఫౌండేషన్ ను ఏర్పాటు చేసి ఎన్నారైలకు ఉచిత వైద్య సేవలు అందించారు. వైద్య బీమా లేక ఇబ్బందులు పడుతున్న ప్రవాస భారతీయులకు అండగా నిలిచారు. తన వ్యాపారంలో రాణించిన ఆయన పురిటి గడ్డ కోసం ఏదైనా చేయాలనే ఉద్దేశంతో స్వదేశానికి తిరిగి వచ్చారు. పల్నాడు ప్రాంత వాసుల ప్రధాన సమస్యగా ఉన్న నీటి కొరతను తీర్చారు.
సొంత డబ్బులతో వందల సంఖ్యలో బోర్వెల్స్, ఆర్వోప్లాంట్స్ ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలను అందించేలా బెస్ట్ బెరీ స్కూల్ను ప్రారంభించారు. పెమ్మసాని ట్రస్టు ఏర్పాటు చేసి.. పేద ప్రజలకు, స్వచ్చంద సంస్థలకు ఆర్థిక సాయం అందిస్తూ వస్తున్నారు. రాజకీయాలపై ఆసక్తితో తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన 2024లో టీడీపీ తరుపున ఎన్డీయే అభ్యర్థిగా గుంటూరు లోక్సభ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. అయితే అనూహ్యంగా మోడీ 3.0లో కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- వ్యాపారి ఇంట్లో భారీ చోరీ కేసులో మిస్టరీని ఛేదించిన హైదరాబాద్ పోలీస్
- రంజాన్ మాసంలో ముస్లిం ఉద్యోగులకు వెసులుబాటు!
- మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్..ప్రారంభించిన సీఎం రేవంత్రెడ్డి
- రోడ్ల విషయమై మంత్రి గడ్కరి ని కలిసిన ఎంపీ బాల శౌరి
- దుబాయ్ లో ది లూప్ ప్రాజెక్ట్..ఎలోన్ మస్క్ తో ఒప్పందం..!!
- కువైట్లో 10 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు..!!
- ఎడారి ప్రాంతాల్లో ఉల్లంఘనలపై కేసులు నమోదు..తనిఖీలు ప్రారంభం..!!
- రియాద్ వేదికగా డిసెంబర్లో గ్లోబల్ ఎయిర్పోర్ట్స్ ఫోరమ్..!!
- ఘోర ప్రమాదం..గ్యాస్ పేలుడుతో కుప్పకూలిన భవనం..!!
- ఫిబ్రవరి 16న మస్కట్లో హిందూ మహాసముద్ర సదస్సు..!!