ఆషాఢమాస బోనాల ఉత్సవాలు షురూ..

- July 07, 2024 , by Maagulf
ఆషాఢమాస బోనాల ఉత్సవాలు షురూ..

హైదరాబాద్: తెలంగాణలో ఆషాఢమాస బోనాల ఉత్సవాలు షురూ అయ్యాయి. ఉత్సవాలకోసం గోల్కొండ, లష్కర్ లాల్ దర్వాజా, బల్కంపేట అమ్మవార్ల దేవాలయాలు అందంగా ముస్తాబయ్యాయి. సిటీలో నెలరోజుల పాటు వేపాకు తోరాణాలతో కళకళలాడబోతుంది. పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, భక్తి పాటలతో మారుమోగనున్నాయి. ఆషాఢ మాసంలో గోల్కొండ జగదాంబ అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో తెలంగాణ వ్యాప్తంగా బోనాల ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. ఇవాళ ఉదయం గోల్కొండ జగదాంబిక బోనాల ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఈనెల 21న లష్కర్ (సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి), 28న లాల్ దర్వాజా (పాతబస్తీ) బోనాలు జరగనున్నాయి.

గోల్కొండ బోనాలు పురాతన గోల్కొండ కోటపై కొలువైఉన్న జగదాంబిక ఎల్లమ్మ అమ్మవారికి తొలిబోనం సమర్పించడంతో మొదలయ్యాయి. కుమ్మరులు తొలిబోనం ను అమ్మవారికి సమర్పించారు. దీంతో బోనాల ఉత్సవాలు ప్రారంభం కాగా.. తెల్లవారు జాము నుంచే జగదాంబ అమ్మవారిని భక్తులు దర్శించుకుంటున్నారు. ఇవాళ్టి (జూలై 7) నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు గోల్కొండ బోనాల జాతర ఉత్సవాలు కొనసాగనున్నాయి. బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుతం తరుపున అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ మధ్యాహ్నం 12గంటలకు బోనాల ఉత్సవాల ఊరేగింపు మొదలు కానుంది. మొదట లంగర్ హౌజ్ నుండి ఘటాల ఊరేగింపు ప్రారంభం కానుండగా.. లంగర్ హౌజ్ నుండి కోట వరకు డప్పు సప్పుళ్ళు, పోతరాజుల డ్యాన్స్, సాంస్కృతిక శాఖ కళాకారుల ఆటపాటలతో అమ్మవార్లకు ఊరేగింపు, ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పణ ఉంటుంది.

రిసల్ బజార్ మహంకాళి అమ్మవారి ఉత్సవ విగ్రహం ఊరేగింపు. బడా బజార్ నుండి జగదాంబా ఎల్లమ్మ అమ్మవారు విగ్రహం ఊరేగింపు. బంజారీ దర్వాజా నుండి సర్కారు తరుపున తొలి బోనం (నజర్ బోనం) ఉరేగింపుగా గోల్కొండకోటకు చేరుకుంటాయి. గోల్కొండ  కోటలో బోనం 28 కులవృత్తుల ఆధ్వర్యంలో బోనాల ఊరేగింపు.. గోల్కొండ కోటల్లో తొలి బోనం సమర్పణతో రాష్ట్ర వ్యాప్తంగా బోనాల జాతర ఉత్సవాలు మొదలవుతాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com