ఇండియాన్ ఫుట్‌బాల్ స్టార్...!

- August 03, 2024 , by Maagulf
ఇండియాన్ ఫుట్‌బాల్ స్టార్...!

సునీల్ ఛెత్రి...ఇండియాలో ఫుట్‌బాల్ క్రీడ‌కు అత్యంత పేరుప్ర‌ఖ్యాతులు తీసుకొచ్చిన ఆట‌గాళ్ల‌లో ఒక‌రు. అస‌మాన ఆట‌తీరుతో ఇండియాకు ఎన్నో అద్భుత‌ విజ‌యాల్ని తెచ్చిపెట్టాడు. స‌రైన ప్రోత్సాహం, మౌళిక స‌దుపాయాలు లేక‌పోయినా ప‌ట్టుద‌ల‌తో ఫుట్‌బాల్ క్రీడాకారుడిగా జీవితాన్ని మొద‌లుపెట్టిన సునీల్ ఛెత్రి త‌న ప్ర‌తిభ‌తో రొనాల్డో, మెస్సీ వంటి దిగ్గ‌జాల స‌ర‌స‌న నిలిచాడు. త‌న సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో గొప్ప రికార్డుల‌ను సునీల్ ఛెత్రి తిర‌గ‌రాశాడు. నేడు ఇండియన్ ఫుట్‌బాల్ దిగ్గజ ఆటగాడు సునీల్ ఛెత్రి పుట్టినరోజు.

సునీల్ ఛెత్రి 1984 ఆగస్టు 3న సికింద్రాబాద్‌లో జన్మించాడు. అతని తల్లి, ఇద్దరు సోదరీమణులు నేపాలీ మహిళల జట్టు కోసం ఫుట్‌బాల్ ఆడారు. బహుశా అందుకే అతనికి చిన్నప్పటి నుంచి ఫుట్‌బాల్‌పై ఆసక్తి ఉండేది. అతని తండ్రి ఇండియన్ ఆర్మీలో గూర్ఖా సైనికుడు అతనికి త్వరగా బదిలీలు జరిగేవి, కానీ అది సునీల్‌కు అటమీద ప్రభావం చూపలేదు. ఛెత్రీ చిన్నప్పటి నుంచి ఫుట్‌బాల్ ఆడడం ప్రారంభించాడు, చిన్న టోర్నమెంట్లలో పాల్గొనేవాడు.

 సునీల్ తన ఫుట్‌బాల్ కెరీర్‌ను 2001లో 17 ఏళ్ల వయసులో ఢిల్లీ నగరంలో ప్రారంభించాడు.ఒక సంవత్సరం తర్వాత మోహన్ బగన్ అతని ప్రతిభను గుర్తించి అతనిని చేర్చుకున్నాడు. ఆ రోజు నుండి సునీల్ యొక్క ప్రొఫెషనల్ ఫుట్బాల్ జీవితం ప్రారంభమైంది, తరువాత అతను ఎప్పుడూ వెనుకకు తిరిగి చూడలేదు. ఛెత్రి 2005లో భారత్‌.. పాకిస్థాన్‌తో ఆడిన మ్యాచ్‌తో జాతీయ జట్టులోకి అడుగుపెట్టాడు. భారత్‌ తరఫున 150కి పైగా మ్యాచ్‌లు ఆడిన అతడు 94 గోల్స్‌ కొట్టాడు.. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ చరిత్రలో క్రిస్టియానో రొనాల్డో (128), మెస్సీ (106) తర్వాత యాక్టివ్‌ ప్లేయర్స్‌ జాబితాలో మూడో స్థానం (ఓవరాల్‌గా 4వ స్థానం) ఛెత్రిదే కావడం గమనార్హం.

భారత ‘ఫుట్‌బాల్‌లో విరాట్‌ కోహ్లీ’గా అభిమానులు పిలుచుకునే ఛెత్రి.. 2007, 2009, 2012లలో బ్లూ టైగర్స్‌ నెహ్రూ కప్‌ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. 2011, 2015, 2021, 2023లో సాఫ్‌ చాంపియన్‌షిప్‌ నెగ్గడంలో అతడిదే కీ రోల్‌.  2012లో జాతీయ జట్టు పగ్గాలు అందుకున్న ఛెత్రి.. భారత్‌కు అత్యధిక కాలం పనిచేసిన సారథిగా రికార్డులకెక్కాడు. ఛెత్రి సారథ్యంలోనే 2018, 2023లలో భారత జట్టు ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌ గెలిచింది. 19 ఏళ్ల పాటు ఆటగాడిగా భారత్‌లో ఫుట్‌బాల్‌కు ఎనలేని ఖ్యాతి తీసుకువచ్చిన ఈ సూపర్‌స్టార్‌ 2024 జూన్‌ 6న కువైట్‌తో కోల్‌కతాలో జరిగిన ఫిఫా వరల్డ్‌ కప్‌ క్వాలిఫయింగ్‌ మ్యాచ్ తర్వాత  రిటైర్మెంట్‌ ను ప్రకటించాడు.

 ఇండియ‌న్ ఫుట్‌బాల్ ఫెడ‌రేష‌న్ నుంచి అత్య‌ధిక సార్లు ఏఐఎఫ్ఎఫ్ అవార్డును అందుకున్న ప్లేయ‌ర్ సునీల్ ఛెత్రి కావ‌డం గ‌మ‌నార్హం. ఈ అవార్డును సునీల్ ఛెత్రి ఆరు సార్లు అందుకున్నాడు. 2019లో పద్మశ్రీ, 2021లో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డులను అందుకున్నాడు.  

--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com