లార్డ్స్ వేదిక‌గా ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్‌..

- September 03, 2024 , by Maagulf
లార్డ్స్ వేదిక‌గా ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్‌..

ఇంగ్లాండ్: క్రికెట్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ (WTC 2023-25) ఫైన‌ల్ మ్యాచ్ తేదీ వ‌చ్చేసింది. 2025 జూన్ 11 నుంచి 15 మ‌ధ్య ఈ ఫైన‌ల్ మ్యాచ్‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) వెల్ల‌డించింది. జూన్ 16ను రిజ్వ‌ర్‌డేగా ప్ర‌క‌టించింది. ఈ మ్యాచ్‌కు ఇంగ్లాండ్‌లోని ప్ర‌ఖ్యాత స్టేడియం లార్డ్స్ వేదిక కానుంది.

ఇప్ప‌టి వ‌ర‌కు రెండు డ‌బ్ల్యూటీసీ ఎడిష‌న్లు జ‌రిగాయి. తొలి ఎడిష‌న్ ఫైన‌ల్ (2021) కు సౌతాంఫ్ట‌న్‌, రెండో ఎడిష‌న్‌ ఫైన‌ల్ కు(2023) ఓవ‌ల్ వేదిక‌లు కాగా.. తాజాగా మూడో ఎడిష‌న్‌కు లార్డ్స్ వేదిక కానుంది. కాగా.. తొలి రెండు ఎడిష‌న్ల‌లో ఫైన‌ల్‌కు చేరిన భార‌త జ‌ట్టు ఆఖ‌రి మెట్టు పై బోల్తా ప‌డింది. తొలిసారి న్యూజిలాండ్‌, రెండో సారి ఆస్ట్రేలియా చేతుల్లో ఓడిపోయి ర‌న్న‌ర‌ప్‌తో స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది.

ఈ క్ర‌మంలో ఈ సారి ఎలాగైన టైటిల్‌ను ద‌క్కించుకోవాల‌ని భార‌త జ‌ట్టు ఆరాట‌ప‌డుతోంది. ప్ర‌స్తుతం డ‌బ్ల్యూటీసీ (2023-2025) పాయింట్ల ప‌ట్టిక‌లో భార‌త్ అగ్ర‌స్థానంలో ఉంది. ఆ త‌రువాత వ‌రుస‌గా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, ద‌క్షిణాఫ్రికాలు ఉన్నాయి.

డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్‌కు ఆడాలంటే మార్చి 2025 నాటికి పాయింట్ల ప‌ట్టిక‌లో తొలి రెండు స్థానాల్లో నిల‌వాల్సి ఉంటుంది. సెప్టెంబ‌ర్ 19 నుంచి భార‌త్ రెండు టెస్టు మ్యాచుల సిరీస్ బంగ్లాదేశ్‌తో ఆ త‌రువాత న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాల‌తో టెస్టు సిరీస్‌లు ఆడాల్సి ఉంది. ఈ సిరీసుల్లో భార‌త గ‌నుక విజ‌యం సాధిస్తే.. ముచ్చ‌ట‌గా మూడోసారి ఫైన‌ల్‌కు చేరుకోవ‌డం పెద్ద క‌ష్టం కాక‌పోవ‌చ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com