పీపుల్ స్టార్-ఆర్.నారాయణమూర్తి
- December 31, 2024
ఆయన ఉద్యమ నేస్తం. ఎర్రెర్రని జెండా ఆయన భావజాలపు అజెండా. పతితులు, భ్రష్టులు, బాధాసర్పదష్టుల జీవితాలు ఆయన చిత్రాల ఇతివృత్తాలు. అధోజగత్ ప్రపంచపు గుండె తడిమి, కన్నీరు తుడిచే మానవీయ కోణం ఆయన వ్యాపకం. సమాజంలో సమకాలీన సమస్యలపై ఎలుగెత్తి నినదించిన విప్లవ శంఖారావం ఆయన గుండె చప్పుడు. నిరాడంబరత ఆయన జీవన శైలి. ఎటువంటి భేషజాలు లేకుండా నలుగురితో కలిసి పోవడమే ఆయన ప్రవృత్తి. ఎదురైనా ప్రతి ఒక్కరిని అక్కున చేర్చుకుని ఆత్మీయత పంచే ఆయన తెలుగు సినీపరిశ్రమలో అజాత శత్రువు. ఆయనే.. ఆర్.నారాయణ మూర్తి. ఉద్యమ శక్తులకు స్ఫూర్తి. విప్లవ చిత్రాల చిరస్థాయి కీర్తి.
ఆకలి బాధలు ఆర్తనాదలే ఆయన కథాంశాలు. పీడితా వర్గాల ప్రజలే ఆయన పాత్రలు. సినిమా అంటే కేవలం కళాత్మకం కాదు.. ఆలోచనత్మకం అని నిరూపించిన ఏకైక మానవీయ వ్యక్తి ఆర్. నారాయణమూర్తి. సామాన్య ప్రజలే తన సినిమాకు పెద్ద ఆస్తి. వాళ్ల కష్టాలే ఆయన సినిమాలోని కథ. ఒక దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా రాణిస్తున్నా.. తాను అనుకున్నది వెండితెరమీద ఆవిష్కరించడమే నారాయణమూర్తి స్టైల్. విప్లవమే తన సినీ పంథాగా మలచుకున్న ఆయన పీడిత వర్గాల ప్రజల హృదయాల్లో "పీపుల్ స్టార్"గా నిలిచిపోయారు. నేడు పీపుల్ స్టార్ ఆర్.నారాయణమూర్తి పుట్టినరోజు.
ఆర్.నారాయణ మూర్తి కేవలం నటుడిగానే కాకుండా స్క్రీన్ రైటర్గా, దర్శకుడిగా, గాయకుడిగా, డాన్సర్గా, నిర్మాతగా తెలుగు సినిమా పరిశ్రమకు సేవలు అందిస్తున్నారు. సొంత చిత్ర నిర్మాణ సంస్థ స్నేహ చిత్ర పిక్చర్స్ ఉంది. సమాజంలో దిగువ శ్రేణిని ఉన్నత వర్గాలు ఎలా దోపిడీ చేస్తారో బహిర్గతం చేసే సమాంతర చిత్రాలను తెరకెక్కించి వాటి ద్వారా ఈయన ప్రసిద్ధి చెందారు. నిరుద్యోగం, ప్రపంచ బ్యాంకు పాలసీలు, అభివృద్ధి చెందుతున్న దేశాలలో సమస్యలు, పర్యావరణ సమస్యలు, ఆనకట్టలు, పునరావాస సమస్యలు, భూ సమస్యలు, రాజకీయ గందరగోళం లాంటి సమకాలీన సామాజిక సమస్యలే ప్రధాన అంశాలుగా ఈయన సినిమాలు తీస్తుంటారు. ఆయన చిత్రాల పేర్లు కూడా విప్లవ సంకేతాలు. 'అర్ధరాత్రి స్వతంత్య్రం', అడవి దివిటీలు, లాల్ సలాం, దండోరా, ఎర్ర సైన్యం, చీమల దండు, దళం, చీకటి సూర్యుడు, ఊరు మనదిరా, వేగు చుక్కలు లాంటి సినిమాలే అందుకు ఉదాహరణలు.
రెడ్డి నారాయణమూర్తి 1953, డిసెంబరు 31న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లాలో రౌతులపూడి మండలంలో మల్లంపేట గ్రామంలో ఈయన జన్మించారు. వీరిది పేద రైతు కుటుంబం. తండ్రి పేరు రెడ్డి చిన్నయ్య నాయడు, తల్లి పేరు రెడ్డి చిన్నమ్మ. ఈ గ్రామంలోనే ఐదో తరగతి వరకు ఆర్.నారాయణ మూర్తి చదువు సాగింది. ఆ తరువాత శంఖవరం పాఠశాలలో విద్యనభ్యసించారు. రౌతులపూడిలో నారాయణ మూర్తి కుటుంబానికి ఓ సినిమా థియేటర్ ఉంది. ఈయనకు బాల్యం నుంచే సినిమాలపై ఆసక్తి ఉండేది. ఎక్కువగా ఎన్టీఆర్, నాగేశ్వరరావుల సినిమాలు చూసే నారాయణ మూర్తి.. వాళ్లను అనుకరించేవారు కూడా.
పెద్దాపురంలో ఎస్.ఆర్.వి.బి.ఎస్.జె.బి.మహారాణి కళాశాలలో బి.ఏ చదువుతున్నప్పుడు రాజకీయాలు, సినిమాలకు ప్రభావితులయ్యారు. ఆయన చదువుతోన్న కళాశాల విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నారు. అలాగే అదే కళాశాలలో లలిత కళల విభాగానికి కూడా కార్యదర్శిగా వ్యవహరించారు. ఇంకా తాను నివాసముంటున్న ప్రభుత్వ హాస్టలుకు కూడా విద్యార్థి అధ్యక్షునిగా ఉన్నారు. పేద విద్యార్థులకు సంబంధించిన నిధి సంఘానికి కూడా కార్యదర్శిగా సేవలు అందించారు. పట్టణ రిక్షా సంఘానికి కూడా ఆర్.నారాయణ మూర్తి అధ్యక్షుడిగా పనిచేశారు. దాంతో, స్థానిక రిక్షా కార్మికులు మద్దతు కోసం ఈయన్ను సంప్రదించేవారు. ఒకసారి బీహార్లో వరద సహాయానికి తన వంతు కృషి చేశారు. కళాశాలలో నారాయణ మూర్తిని సహ విద్యార్థులు 'అన్న' అని పిలిచేవారు.
నారాయణమూర్తికి చిత్రాల్లో హీరోగా నటించాలని ఉండేది. అందుకోసం ఇంటర్మీడియేట్ పరీక్షలు పూర్తయిన తరువాత మద్రాస్ వెళ్లిపోయారు. అయితే, ఇంటర్మీడియేట్ పరీక్షలలో తాను ఫెయిల్ అవుతానని అనుకొని మద్రాస్ వెళ్లారు నారాయణ మూర్తి. 17, 18 వయసులో మద్రాస్లో తిండి, వసతి అనేక కష్టాలు పడుతోన్న సమయంలో ఒకసారి తాను ఇంటర్మీడియేట్ పరీక్షల్లో పాస్ అయినట్టు తెలిసింది. అదేసమయంలో అనుకోకుండా నేరము శిక్ష సినిమాలో రాముని బంటుని రా అనే పాటలో 170 మంది జూనియర్ ఆర్టిష్టులలో ఒకరిగా నటించే అవకాశం లభించింది.
ఆ పాత్రలో చేసినప్పటికీ, అంత చిన్న పాత్ర అవడం వల్ల నారాయణ మూర్తి ఎంతో నిరుత్సాహపడ్డారు. ఎలాగో ఇంటర్మీడియేట్ పరీక్ష పాస్ అయినట్టు తెలిసింది. కాబట్టి డిగ్రీ చదువు పూర్తి చేసి రమ్మని దాసరినారాయణ రావు నారాయణ మూర్తికి సలహా ఇచ్చారు. సహజంగా ఎన్టీఆర్ను ఇష్టపడే నారాయణమూర్తి సినిమా టైటిల్స్ వేసేటప్పుడు ఎన్టీఆర్ పేరు పక్కన బి.ఏ అనే అక్షరాలు చూసి తాను బి.ఏ. చదవాలని ఆశపడ్డారు. అలా బి.ఏ. చదవడానికి తూర్పు గోదావరికి నారాయణమూర్తి వచ్చిన సమయంలోనే నేరము శిక్ష సినిమా రిలీజ్ అయింది. అందులో 170 జూనియర్ ఆర్టిస్టులలో ఒక చిన్న పాత్ర చేసినప్పటికీ ఆయన ఊరి ప్రజలు నారాయణమూర్తి సన్నివేశాలు వచ్చినప్పుడు గుర్తుపట్టి మరీ ఈలలూ, చప్పట్లు కొట్టేవారు.
అలా గుర్తింపు తెచ్చుకొన్న కారణంగా నారాయణమూర్తి డిగ్రీ పూర్తి చేసిన తరువాత చిత్రాల్లో నటించాలని అప్పుడే నిర్ణయించుకొన్నారు. బి.ఏ. చదువుకుంటున్నప్పుడు ఒకపక్క కళాశాల సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటూనే మరోపక్క కమ్యూనిస్టు పుస్తకాలూ బాగా చదువుకునేవారు. కళాశాలలో హీరోయిన్ మంజుల నృత్య కార్యక్రమం ఏర్పాటు చేసే పనిలో ఒక ముఖ్య పాత్రను పోషించారు. బి.ఏ. అయిన తరువాత మద్రాస్కు వెళ్లిపోయారు.
డిగ్రీ అర్హత కూడా ఉండడం వల్ల సినిమాలలో వేషాలు దొరకడం కష్టం కాదని భావించిన నారాయణ మూర్తికి ఈసారి కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయాయ్యి. కష్టాలు పడుతూనే స్టూడియోల చుట్టూ తిరగడం ఓ పనిగా పెట్టుకున్నారు. అలా చిన్న, చిన్న పాత్రలను సంపాదించుకునేవారు. ఆ పాత్రలు చేస్తున్నప్పుడు కూడా షూటింగ్ రోజు మాత్రమే భోజనం ఉండేది. అటువంటి సమయంలో దాసరి నారాయణరావు తాను తెరకెక్కిస్తోన్న నీడ సినిమాలో ప్రముఖ పాత్రను నారాయణ మూర్తికి ఇచ్చారు. ఇందులో నారాయణ మూర్తి ఓ నక్సలైటు పాత్రలో నటించారు. మంచి విజయం అందుకొంది ఈ చిత్రం. మద్రాస్లోని చోళ హోటల్లో వంద రోజుల షీల్డుని కరుణానిధి చేతుల మీదుగా అందుకొన్నారు.
దాసరి నారాయణ రావు, అగ్ర నిర్మాత రామానాయుడు ప్రోత్సాహాలతో ఎన్నో చిత్రాలలో సహాయక పాత్రలలో నటించారు. దాసరి తెరకెక్కించిన సంగీత అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించారు. యాభై రోజుల పాటు ఆడిన ఈ చిత్రం తరువాత కథానాయకుడిగా అవకాశాలు రాక బాగా ఇబ్బంది పడ్డారు నారాయణ మూర్తి. దాంతో, దర్శకుడిగా నిలుదొక్కుకుంటే హీరోగా మారవచ్చన్న ఆలోచన వచ్చింది. దర్శకత్వ శాఖలో అనుభవం లేని కారణంగా... సినిమాలకు దర్శకత్వం వహించే అవకాశం రాలేదు నారాయణ మూర్తికి. దాంతో, తనే సినిమాను సొంతంగా నిర్మిస్తే తప్ప తనకు దర్శకత్వ బాధ్యతలు రావని భావించారు. స్నేహితులు సహకరించడంత వల్ల స్నేహ చిత్ర అనే సొంత నిర్మాత సంస్థను స్థాపించారు. అలా ఓ సొంత నిర్మాణ సంస్థను స్థాపించారు నారాయణ మూర్తి.
అలా స్నేహ చిత్ర బ్యానర్పై అర్ధరాత్రి స్వతంత్రం అనే సినిమాను రంపచోడవరంలో మొదలుపెట్టారు నారాయణమూర్తి. ఈ చిత్రానికి సంబంధించిన దర్శక, నిర్మాణ బాధ్యతలు తీసుకొన్నారు. 1984న ప్రారంభమయిన ఈ సినిమా సెన్సార్ బోర్డు ద్వారా ఆటంకాలను ఎదురుకోవాల్సి వచ్చింది. ఆ ఆటంకాలను దాటి 1986న ఈ సినిమా టి.కృష్ణ వర్ధంతి రోజున (నవంబర్ 6)న రిలీజ్ అయింది. ఈ చిత్రంలో నక్సలైటు పాత్రను పోషించారు నారాయణ మూర్తి. ఈ మూవీ విజయవంతమైంది.
ఆ తరువాత దండోరా, ఎర్ర సైన్యం, లాల్ సలాం వంటి సినిమాలను తెరకెక్కించారు. వాస్తవ సమస్యలను ప్రధాన కథాంశంగా నారాయణ మూర్తి సినిమాలు తెరకెక్కుతాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎర్ర సైన్యం చిత్రం ఒక ట్రెండును క్రియేట్ చేసింది. కొన్ని సంవత్సరాలు పాటు విజయాలను చూసిన నారాయణమూర్తి ఆ తరువాత కొంత కాలం పాటు వరుసగా అపజయాలను చూశారు. ఆ తరువాత వచ్చిన ఊరు మనదిరా సినిమా విజయం సాధించడం వల్ల ఆర్ నారాయణ మూర్తి నట జీవితంలో రెండవ అంకం మొదలైనట్టైయ్యింది. నారాయణ మూర్తి ప్రధాన పాత్రలో నటించిన అర్ధరాత్రి స్వతంత్రం, వేగు చుక్కలు, అడవి దివిటీలు, ఊరు మనదిరా, లాల్ సలాం, చీకటి సూర్యులు, దండోరా, దళం, చీమలదండు, ఎర్ర సైన్యం సినిమాలు విజయవంతమయ్యాయి.
అర్ధరాత్రి స్వతంత్రం, ఆలోచించండి, భూపోరాటం, అడవి దివిటీలు, స్వతంత్ర భారతం, లాల్సలాం, దండోరా, ఎర్రసైన్యం, చీమలదండు, దళం, చీకటి సూర్యులు, రైతురాజ్యం, కూలన్న, ఛలో అసెంబ్లీ, ఊరు మనదిరా, వేగుచుక్కలు, గంగమ్మ జాతర, అమ్మమీద ఒట్టు, అడవి బిడ్డలు, ఎర్రసముద్రం, కూతురి కోసం, ఎర్రోడు, ఒరేయ్ రిక్షా, అరణ్యం, సింగన్న, తెలుగోడు, భీముడు, ఏ ధర్తీ హమారీ (హిందీ), వీర తెలంగాణ, పోరు తెలంగాణ, పీపుల్స్ వార్, నిర్భయ భారతం, రాజ్యాధికారం, దండకారణ్యం, హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య, అన్నదాతా సుఖీభవ, యూనివర్సిటీ వంటి సినిమాలలో నటించారు.
నారాయణమూర్తిది అతి సాధారణ జీవనశైలి. నిర్మాత అంటే కారులు ఉండే ఈ రోజులలో ఆయనకు ఒక కారు కూడా లేకపోవడం ఎంతో ఆశ్చర్యకరమైన విషయం. ఒక సాధారణమైన వ్యక్తి లాగానే జీవితాన్ని గడపడానికి ఎక్కువగా ఇష్టపడతారు. హైదరాబాద్లో చిన్న చిన్న హోటల్స్లో సాధారణమైన వ్యక్తిలాగానే సామాన్య జనులతో భోజనం చేస్తారు. నిరాడంబరతకు అసలు సిసలైన స్ఫూర్తిని పొందాలంటే ఈయన దగ్గర నుంచే పొందాలి. మరే హీరో కూడా ఈయన తరహాలో జీవితాన్ని గడపరు. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు తమ తమ పార్టీల్లోకి ఆహ్వానించినా రాజకీయాల్లోకి ప్రవేశించే ఉద్దేశం లేదని ఆ అవకాశాలను తిరస్కరించారు.
తన ప్రజా జీవితాన్ని తనకొచ్చే జీవిత భాగస్వామి ఎక్కడైనా వ్యతిరేకిస్తుందేమోననే సందేహంతో నారాయణమూర్తి వివాహం చేసుకోలేదట. అయితే, తాను పెళ్లి చేసుకోనందుకు ఎంతో బాధపడుతునాన్నని పలు ఇంటర్వ్యూల్లో చెబుతూ ఉంటారు. ఒంటరితనం కమ్మేస్తుందని విచారిస్తూ ఉంటారు. అందుకే ఇంకా సెటిల్ అవలేదన్న ఆలోచన మాని, చక్కగా పెళ్లి చేసుకోండని యువతీ యువకులకు సూచిస్తున్నారు.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









