వెండితెర హాస్య బ్రహ్మా-జంధ్యాల
- January 14, 2025
“నవ్వడం యోగం… నవ్వించడం భోగం… నవ్వకపోవడం రోగం…” అంటూ ఓ నవ్వుల సూత్రాన్ని జనానికి పరిచయం చేశారు జంధ్యాల. ఇంటిపేరుతోనే రచయితలుగా ఎందరో వెలుగులు పంచారు. వారిలో పసందైన పదాలు పరిచయం చేసిన వారు ఎందరో. అలాంటి వారిలో జంధ్యాల పేరు వినగానె తెలుగుజనానికి కితకితలు పెట్టినట్టు ఉంటుంది. ఒకటా రెండా మరి, జంధ్యాల రచనలో జాలువారిన పదాలయితేనేమి, ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన వినోదాల విందులయితేనేమి అన్నీ మనకు హాయిగా నవ్వుకొనే వీలు కల్పిస్తాయి. నేడు వెండితెర హాస్య బ్రహ్మా జంధ్యాల వారి జయంతి.
జంధ్యాల వారి పూర్తి పేరు వీరవేంకట దుర్గాశివ సుబ్రహ్మణ్య శాస్త్రి. 1951 జనవరి 14న జంధ్యాల నరసాపురంలో జన్మించారు. పండితుల ఇంట పుట్టడం వల్ల చిన్నతనంలోనే సాహిత్యాభిమానం నెలకొంది. తెలుగులో గొప్పకవుల రచనలన్నీ చదివేశారు. చదువుకొనే రోజుల్లోనే నాటకాలు రాసి ప్రదర్శించేవారు. ఆయన రాసిన ‘ఏక్ దిన్ కా సుల్తాన్’ తెలుగునేలలోనే కాదు, చుట్టుపుక్కల రాష్ట్రాల్లోనూ వేల ప్రదర్శనలు చూసింది. ఓ నాటక ప్రదర్శనలో మహానటుడు గుమ్మడితో పరిచయం కలిగింది. ఆ సమయంలో గుమ్మడి, జంధ్యాలను సినిమాల్లో రచయితగా ప్రయత్నించమని సూచించారు. ఆ సూచన పట్టుకొనే గుమ్మడి తనయుడు హీరోగా నటించిన ‘పుణ్యభూమి కళ్ళు తెరిచింది’లో ఓ పాట రాశారు. తరువాత ‘దేవుడు చేసిన బొమ్మలు’ చిత్రంతో మాటల రచయిత అయ్యారు. తరువాత కె.విశ్వనాథ్ “సిరిసిరిమువ్వ, శంకరాభరణం, సాగరసంగమం” వంటి చిత్రాలకు మాటలు రాసి మురిపించారు.
‘శంకరాభరణం’ వంటి క్లాస్ చిత్రాలకు సంభాషణలు అందిస్తునే… ‘అడవిరాముడు’, ‘వేటగాడు’ వంటి మాస్ సినిమాలకు డైలాగ్స్ రాస్తూ తన కలానికి రెండు వైపులా పదును ఉందని నిరూపించాడు జంధ్యాల. మాటల రచయతగా ప్రారంభమైన జంధ్యాల సినీ కెరీర్.. ఆ తర్వాత దర్శకుడి అవతారమెత్తి అనేక హాస్య చిత్రాలను ప్రేక్షకులకు అందించాడు. తన సినిమాలు కుటుంబ సభ్యులు అందరు కూర్చోని చూసే ఆరోగ్యకరమైన హాస్య చిత్రాలు అందించారు. డైరెక్టర్గా ఆయన తొలి చిత్రం ‘ముద్ద మందారం’. తొలి చిత్రంతోనే సక్సెస్ అందుకున్నారు జంధ్యాల.
క్లాసికల్ డాన్స్ ఇతివృత్తంతో ఆయన తీసిన ‘ఆనందభైరవి’ విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ గా మంచి విజయాన్ని నమోదు చేసింది. హీరో రాజేంద్రప్రసాద్ తో జంధ్యాల కి ప్రత్యేక అనుబంధం ఉంది. కామెడీహీరోగా రాజేంద్రపసాద్ నిలదొక్కుకోవడానికి జంధ్యాల డైరెక్ట్ చేసిన చిత్రాలు కీ రోల్ పోషించాయి.జంధ్యాల ఒక్కో చిత్రం హాస్యపు ఆణిముత్యం. మెగాస్టార్ తో సైతం ‘చంటబ్బాయి’ గా చిత్ర విచిత్ర వేషాలు వేయించిన ఘనపాటి జంధ్యాల. ఈ సినిమాలో చిరంజీవిని జేమ్స్ పాండ్ గా మార్చి ప్రేక్షకులపై హాస్యపు జల్లులు కురిపించాడు. అలాగే చిరంజీవిలో ఉన్న మంచి కామెడీ నటుడ్ని వెలికి తీసిన ఘనత కూడా హాస్య బ్రహ్మ జంధ్యాలకే దక్కుతుంది.
‘అహనా పెళ్లంట’, ‘ఒహోనా పెళ్లంట’, ‘చూపులు కలిసిన శుభవేళ’, ‘జయమ్ము నిశ్మయమ్మురా’, ‘వివాహా భోజనంబు’…వంటి పాత తెలుగు సినిమాల్లోని పాటల పల్లవులు తన చిత్రాలకు టైటిల్స్ గా పెట్టి కొత్త ట్రెండ్కు శ్రీకారం చుట్టాడు జంధ్యాల. టైటిల్స్తోనే ప్రేక్షకులను ఆకట్టుకొనేలా చేయడంలో జంధ్యాలకు సాటి మరెవరు లేరూ.
ఎంతో మంది కామెడీ నటీనటులను తెలుగుతెరకు అందించిన ఘనత జంధ్యాలది. ముఖ్యంగా సుత్తి జంటైన వీరభద్రరావు, వేలుని ‘నాలుగు స్తంభాలాట’ సినిమాతో వెండితెరకు పరిచయం చేసాడు. ఆ తర్వాత ఈ సుత్తిజంట ఎన్నో చిత్రాల్లో తమ కామెడీ టైమింగ్ తో ఓ వెలుగు వెలిగేలా చేసిన ఘనత జంధ్యాలకే దక్కుతుంది.తెలుగ వారందరికీ పరిచయమైన బ్రహ్మానందాన్ని ‘అహనా పెళ్లంట’ చిత్రంతో స్టార్ కమెడియన్ చేసిన గొప్ప దర్శకుడు జంధ్యాల. ‘ఒరేయ్ అరగుండు వెధవ’ అని కోటతో బ్రహ్మానందాన్ని తిట్టించినా.. అది జంధ్యాలకు మాత్రమే చెల్లింది. బ్రహ్మానందం కామెడీ స్టార్ గా ఎదగడంలో జంధ్యాల పాత్ర మరిచిపోలేనిది.
జంధ్యాల చేసి వడ్డించిన భాషాపరోటాలను ఆరగించని తెలుగువారు ఉండరంటే అతిశయోక్తి కాదు. పింగళి వారి బాణీని పట్టేసినట్టే కనిపిస్తుంది కానీ, జంధ్యాల మార్కు మాటల తీరు వేరుగా ఉంటుంది. ఎందుకలా అనిఅడిగేరు – “చరిత్ర అడక్కు… చెప్పింది విను…” అనాల్సి వస్తుంది. ప్రాస కోసం ప్రయాసపడి పరేషాన్ చేసేవాళ్లు ఎందరో ఉంటారు. కానీ, ఏ భాషలోనైనా, ఏ యాసతోనైనా ప్రాసల పాయసాలు చేయగల నేర్పు ఓర్పు జంధ్యాల సొంతం.
దరిద్ర నారాయణుడికి దిక్కు మాలిన స్వరూపం అని వర్ణించినా…. పాండురంగారావును జేమ్స్ పాండ్ చేసినా…హై హై నాయకాలో బూతు బూతు అని వినీ వినిపించని బూతులు తిట్టించినా…శ్రీవారికి ప్రేమలేఖ చిత్రంలో శ్రీలక్ష్మీతో సినిమా స్టోరీ చెప్పించినా… ‘జయమ్ము నిశ్చయమ్మురా’ బాబూ చిట్టి అని శ్రీలక్ష్మీతో వెరైటీ డైలాగ్స్ పలికించినా అది ఒక్క జంధ్యాలకే సొంతం. పదాలతో రిథమ్ సృష్టించగల దిట్ట జంధ్యాల. కావాలంటే “ఈస్ట్, పేస్ట్, టోస్ట్…” అంటూ ‘వేటగాడు’లో జంధ్యాల కలం పలికించిన పదవిన్యాసాలతో కాసేపు సాగండి. మళ్ళీ మళ్ళీ ఆ యాసతో సాగినా ఏ ఆయాసం మీ దరి చేరదు. పై పెచ్చు వీలుంటే మరోమారు ఆ పదవిన్యాసాలతోనే సాగాలనిపిస్తుంది.
‘విజయావారి’లాగా వినోదాలతోనే జనాన్ని మైమరపించాలని ఎందరో రచయితలు భావించేవారు. అలా రచనలు చేసి ఆకట్టుకున్న వారికి కొదవే లేదు. ఆ రీతినే ఎంచుకున్నారు జంధ్యాల. మెగాఫోన్ పట్టి తొలుత ‘ముద్దమందారం’ పూయించారు. తరువాత ఏకబిగిని సినిమాలు తీశారు. ఆ తీతలోనూ, ఆయన రాతలోనూ మనసులను కట్టిపడేసిన సన్నివేశాలూ ఉన్నాయి. గిలిగింతలు పెట్టిన మాటల కోటలూ ఉన్నాయి. వాటిలో ఒకసారి ప్రవేశిస్తే చాలు మళ్లీ రావాలనిపించదు. జయాపజయాలతో నిమిత్తం లేకుండా ఆ కోటలు బీటలు వారకుండా తెలుగువారికి నేటికీ వినోదాల విందు అందిస్తూనే ఉన్నాయి. ఇంతలా వినోదాలు పంచిన జంధ్యాల నటనలోనూ ఘటికుడే అనిపించుకున్నారు. కె. విశ్వనాథ్ తలపులో మెరసిన ఓ ఊహకు తన అభినయంతో జంధ్యాల ప్రాణం పోసిన తీరును ‘ఆపద్బాంధవుడు’లో చూసి తీరాల్సిందే.
హీరో ఎవరైనా..నటీనటులు ఎవరైనా…తన మార్కు హాస్యం ఉండేలా జాగ్రత్త తీసుకునేవారు జంధ్యాల. ఆయన ఒక్కో చిత్రానికి ఒక్కో ప్రత్యేకత ఉండేలా చూసుకునేవారు. తన సినిమాలతో ఆరోగ్యకరమైన హాస్యాన్ని అందించి తన సత్తా చాటిన దర్శకులు జంధ్యాల. తెలుగు వారిని తన నవ్వులతో ముంచిన హాస్య బ్రహ్మ 2001,జూన్ 19న హాస్య ప్రియులను శోకసంద్రంలో ముంచుతు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. బహుముఖ ప్రజ్ఞతో భాసిల్లిన జంద్యాల ప్రతిభాపాటవాలను మననం చేసుకున్న ప్రతీసారి మనసు మహదానందంతో చిందులు వేస్తూనే ఉంటుంది. అందుకే విజ్ఞులు అంటారు – ‘జంధ్యాల అంటే తెలుగువారికి లభించిన ఓ వరం’ అని. కాదంటారా? కాదనేవారు అసలు కనిపిస్తేగా!
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!
- అనుమతి లేకుండా వ్యక్తిగత డేటా బహిర్గతం..తీవ్రమైన నేరం..!!
- అబుదాబి-దుబాయ్ E11లో EV మెగాహబ్..!!
- 1,197 మంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్..!!
- ముసందంలో డిస్కవరీ డైవింగ్ సెంటర్.. టూరిజానికి బూస్ట్..!!
- 2025లో కుటుంబం,బాలల రక్షణకు 4,400 రిపొర్టులు..!!
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్ను నిర్వహించిన జనసేన గల్ఫ్సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం







